Mallikarjun Kharge: అబద్ధాలకోరు ప్రధాని!
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:05 AM
ప్రధాని మోదీవంటి అబద్ధాలకోరును తానింతవరకు చూడలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 11 ఏళ్ల పాలనలో 33 తప్పులు చేశారని ఆరోపించారు.

పేదలు, యువతను ట్రాప్ చేస్తారు.. వారి ఓట్లు కాజేస్తారు: మల్లికార్జున ఖర్గే
బెంగళూరు-ఆంధ్రజ్యోతి/న్యూఢిల్లీ, జూన్ 11: ప్రధాని మోదీవంటి అబద్ధాలకోరును తానింతవరకు చూడలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 11 ఏళ్ల పాలనలో 33 తప్పులు చేశారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్లు.. మూడో టర్మ్లో మొదటి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం కలబురగిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇన్ని అబద్ధాలాడే ప్రధానిని నేనింతవరకు చూడలేదు. ఎన్నో తప్పులు చేస్తారు. ప్రజలను ఉచ్చులో బిగిస్తారు.. యువతను మోసగిస్తారు.. పేదలను ట్రాప్ చేస్తారు.. ఓట్లు పొందుతారు. నేను 55 ఏళ్లు అధికార పదవుల్లో ఉన్నాను. 65 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నాను. మోదీలాంటి వ్యక్తి ఎక్కడా లేరు. ప్రతి విషయంలోనూ అసత్యాలాడతారు. చెప్పేది ఒక్కటీ అమలు చేయరు. 11 ఏళ్లుగా ఇదే తంతు’ అని ధ్వజమెత్తారు. రాజ్యాంగం ప్రకారం లోక్సభలో డిప్యూటీ స్పీకర్ను నియమించాలని మోదీకి తాను లేఖ రాశానన్నారు. ఆయన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అని అంటుంటారని.. కానీ స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రధానమంత్రీ ఇన్నేళ్లు ఈ పదవిని ఖాళీగా ఉంచలేదన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షానికి చెందిన నాయకుడికి ఈ పదవి కట్టబెట్టామని.. అంతకుముందు కూడా నియామకం జరిగిందని తెలిపారు. మోదీ చర్య చట్టవిరుద్ధం, అప్రజాస్వామికమని.. విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనుకోవడం లేదని.. ఆయనకు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదని విమర్శించారు. ఆర్సీబీ జట్టును సన్మానించే క్రమంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట అకస్మిక సంఘటనగా పేర్కొన్నారు. దీనికి తమ వాళ్లు క్షమాపణలు చెప్పారని.. అయినా వివాదం ఎందుకని ప్రశ్నించారు. కుంభమేళాలో తొక్కిసలాటకు బాధ్యత వహించి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేశారా అని ఖర్గే ప్రశ్నించారు.
పహల్గాంపై సభలో చర్చించాలి
పాకిస్థాన్ ప్రేరిత సీమాంతర ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్పై పార్లమెంటరీ బృందాలను విదేశాలకు పంపించిన ప్రధాని మోదీ.. పహల్గాం దాడి అనంతరం దేశంలో భద్రత, విదేశాంగ విధానం సవాళ్లపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సమగ్ర స్థాయి చర్చకు అంగీకరిస్తారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘చైనా, పాకిస్థాన్లపై భావి వ్యూహం.. ఆపరేషన్ సిందూర్లో కొన్ని యుద్ధవిమానాలను కోల్పోయామని సీడీఎస్ అనిల్ చౌహాన్ వెల్లడించిన దరిమిలా ఏర్పడిన పరిణామాలపై చర్చించేందుకు ప్రధాని తన నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం, భేటీలు ఏర్పాటుచేస్తారా? అన్ని పార్టీలను విశ్వాసంలోకి తీసుకుంటారా’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోదీ సర్కారు నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు.
బడుగుల హాస్టళ్లు దుర్భరం: రాహుల్
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లలో దుర్భర పరిస్థితులు ఉన్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అట్టడుగు వర్గాల విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతనాల విడుదలలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. ప్రతి హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో ఆడిట్ నిర్వహించాలన్నారు.