Lalithaa Jewellery IPO: లలితా జువెలరీ రూ.1700 కోట్ల తొలి ఐపీఓ
ABN , Publish Date - Jun 08 , 2025 | 08:24 PM
బంగారు నగల వ్యాపార సంస్థ లలితా జువెలర్స్ ఐపీవో కి రాబోతోంది. తొలి పబ్లిక్ ఆఫర్ ద్వారా దాదాపు రూ.1700 కోట్లు సమీకరించాలనుకుంటోంది. ప్రమోటర్ అయిన కిరణ్ కుమార్ జైన్ రూ.500 కోట్ల విలువైన తన షేర్లు విక్రయించాలని తలపెట్టారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రముఖ బంగారు నగల వ్యాపార సంస్థ లలితా జువెలర్స్ ఐపీవో కి రాబోతోంది. ఇటీవలి కాలంలో బాగా పేరెనికగన్న ఆభరణాల విక్రయ సంస్థ అయిన లలితా జువెలరీ మార్ట్ తొలి పబ్లిక్ ఆఫర్ (IPO) ఇష్యూ ద్వారా దాదాపు రూ.1700 కోట్లు సమీకరించాలనుకుంటోంది. ఇందుకు అనుమతి కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ప్రాథమికంగా పత్రాలు దాఖలు చేసింది. తద్వారా ఈ సంస్థ కొత్తగా రూ.1200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు జారీ చేస్తుంది. ఇదే కాకుండా ఓఎఫ్ఎస్ (OFS ఆఫర్ ఫర్ సేల్) కింద సంస్థ ప్రమోటర్ అయిన కిరణ్ కుమార్ జైన్(గుండు అంకుల్) రూ.500 కోట్ల విలువైన తన షేర్లు విక్రయించాలని తలపెట్టారు.
ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించే నిధులను కొత్తగా 12 స్టోర్లు ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు. కొంత మొత్తాన్ని ఇతర కార్పొరేట్ అవసరాలకు వాడుకుంటారు. ఇష్యూ తర్వాత ఈక్విటీ షేర్లను ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో నమోదు చేస్తారు. ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఈక్విరస్ కేపిటల్ ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా, ఎంయూఎఫ్జీ ఇన్టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్గా ఈ ఐపీవో క్రతువును నిర్వహిస్తాయి.
కాగా, లలితా జువెలర్స్కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 56 రిటైల్ షోరూంలు ఉన్నాయి. ఈ సంస్థ చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. 2022- 24 మధ్య ఈ సంస్థ ఆదాయాల్లో ఏటా 43.62% వృద్ధి నమోదైంది. సంస్థకు కొంతమేర అప్పులు కూడా ఉన్నాయి. ఇప్పటికే మన స్టాక్ మార్కెట్లో నమోదైన ఈ తరహా సంస్థల్లో టైటన్ ఇండియా, కళ్యాణ్ జువెలర్స్, పీసీ జువెలర్స్, పీఎన్ గాడ్గిల్ జువెలర్స్, తంగమలై, టీబీజడ్ ప్రముఖంగా ఉన్నాయి.
ఇవీ చదవండి:
ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..