CM Siddaramaiah: ఆర్సీబీ సన్మానానికి నన్ను ఆహ్వానించారు
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:41 AM
చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట, ఆర్సీబీకి సన్మాన కార్యక్రమాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని నిన్నటిదాకా చెబుతూ వచ్చిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇప్పుడు మాటమార్చారు.

గవర్నర్ను నేనే రమ్మన్నాను: సీఎం సిద్దరామయ్య
బెంగళూరు, జూన్ 11: చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట, ఆర్సీబీకి సన్మాన కార్యక్రమాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని నిన్నటిదాకా చెబుతూ వచ్చిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇప్పుడు మాటమార్చారు. విధానసౌధలో ఐపీఎల్ విజేతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు స్వయంగా తనను కోరారని.. అందుకు తాను అంగీకరించానని బుధవారం ఆయన మీడియాకు వెల్లడించారు. ‘విధానసౌధలో జరిగే సన్మానానికి హాజరు కావాలని నన్ను ఆహ్వానించారు. నేను సరేనన్నాను. ఈ కార్యక్రమానికి గవర్నర్ గెహ్లాట్ తనంత తాను వచ్చినట్లు మీడియా పేర్కొంది.
ఇది వాస్తవం కాదు. సన్మానానికి నేను హాజరవుతున్నందున మీరు కూడా వస్తే బాగుంటుందని గవర్నర్ను కోరాను. ఆయన వచ్చారు. 20 నిమిషాల్లోనే సన్మానం పూర్తయింది. ఆ వెంటనే ఆయన వెళ్లిపోయారు. నేను కూడా నా నివాసానికి చేరుకున్నాను’ అని సీఎం వివరించారు. మరోవైపు.. ఆర్సీబీ, బీసీసీఐ అనుమతులు తీసుకోకుండా చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాలను నిర్వహించడమే తొక్కిసలాటకు కారణమని రాష్ట్రప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. ఇదిలా ఉండగా, చిన్నస్వామి గేట్లను సకాలంలో తెరవకపోవడం వల్లనే తొక్కిసలాట జరిగిందని బాఽధితులు విచారణాధికారికి తెలిపారు.