న్యాయవ్యవస్థ క్రియాశీలత.. న్యాయఉగ్రవాదం కావద్దు
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:57 AM
న్యాయవ్యవస్థ తాను జోక్యం చేసుకోకూడని అంశాల్లో కలుగజేసుకోవడం మంచిది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదంగా మారకూడదని వ్యాఖ్యానించారు.

జోక్యం చేసుకోకూడని అంశాల్లో కలుగజేసుకోవడం మంచిది కాదు
న్యాయసమీక్ష అధికారాన్ని అరుదైన కేసుల్లోనే వినియోగించాలి
రాజ్యాంగ మూలసూత్రాలకు, ప్రాథమిక హక్కులకు విఘాతం
కలిగినప్పుడే ఆ అధికారం వినియోగించాలి: సీజేఐ బీఆర్ గవాయ్
న్యూఢిల్లీ, జూన్ 11: న్యాయవ్యవస్థ తాను జోక్యం చేసుకోకూడని అంశాల్లో కలుగజేసుకోవడం మంచిది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదంగా మారకూడదని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాధమిక హక్కులను పరిరక్షించడంలో ఏదైనా చట్టంగానీ, కార్యనిర్వాహక యంత్రాంగంగానీ విఫలమైనప్పుడు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవచ్చని.. అయితే ఈ న్యాయసమీక్ష అధికారాన్ని అరుదైన కేసుల్లో మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. బుధవారం ఆక్స్ఫర్డ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడారు. భారత రాజ్యాంగం రాతప్రతి రూపంలో ఉన్న నిశ్శబ్ద విప్లవమని అభివర్ణించారు. దేశ పౌరుల హక్కులకు అభయమివ్వడమే కాకుండా అణగారినవర్గాల అభ్యున్నతికి తోడ్పడిన శక్తి రాజ్యాంగమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అండ్ బెంచ్ వెబ్సైట్ ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘భారతదేశంలో న్యాయవ్యవస్థ క్రియాశీలత అవసరమే. అయితే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడని అంశాల్లో కలుగజేసుకోవడం మంచిదికాదు. న్యాయవ్యవస్థ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదంగా మారకూడదు. మీరు పరిమితులను మీరడానికి ప్రయత్నిస్తే.. సాధారణంగా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడని అంశాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. ప్రజల హక్కుల పరిరక్షణలో చట్టాలు, కార్యనిర్వాహక యంత్రాంగం విఫలమైనప్పుడు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవచ్చు. కానీ న్యాయసమీక్ష అధికారాన్ని అరుదైన కేసుల్లో మాత్రమే వినియోగించాలి. ఏదైనా చట్టం రాజ్యాంగ మూల సూత్రాలతో విభేదించినప్పుడుగానీ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేరుగా విఘాతం కలిగినప్పుడుగానీ, ఏదైనా శాసనం పూర్తి ఏకపక్షంగా, వివక్షాపూరితంగా ఉన్నప్పుడుగానీ న్యాయసమీక్ష అధికారాన్ని వినియోగించుకోవాలి’’ అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన అంశంపై కలకలంతో..
రాష్ట్రపతి, గవర్నర్లు తమకు అందిన బిల్లులపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇలా గడువు నిర్దేశించే అధికారం కోర్టుకు ఉంటుందా? ఈ అంశంలో రాజ్యాంగం ఏం చెబుతోంది? రాష్ట్రపతి, గవర్నర్లు తమ విధి నిర్వహణకు సంబంధించి ఏ కోర్టుకూ జవాబుదారీ కాదని ఆర్టికల్ 361 స్పష్టం చేసిన అంశాలపై అభిప్రాయం తెలపాలంటూ సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.