Pahalgam Hero: పహల్గాం ధీరుడి భార్యకి ఉద్యోగం
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:34 PM
పహల్గాం ఉగ్రదాడి ఉదంతంలో రొమ్ములెదురొడ్డి నిలిచిన ధీరుడి ఆత్మకు శాంతి కలిగే సంఘటన ఇది. ఉగ్రమూక చేతిలో చిక్కుకున్న పర్యాటకులను రక్షించే ప్రయత్నంలో స్థానికుడైన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మరణించిన సంగతి తెలిసిందే.

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి ఉదంతంలో రొమ్ములెదురొడ్డి నిలిచిన ధీరుడి ఆత్మకు శాంతి కలిగే సంఘటన ఇది. పహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో చిక్కుకున్న పర్యాటకులను రక్షించే ప్రయత్నంలో స్థానికుడైన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మరణించిన సంగతి తెలిసిందే.
అతని కుటుంబ సభ్యులను జమ్మూ కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇవాళ కలుసుకున్నారు. దివంగత హుస్సేన్ షా భార్య గుల్నాజ్ అఖ్తర్కు ప్రభుత్వ ఉద్యోగమిస్తూ దానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు భారత సర్కారుకు ధన్యవాదాలు తెలిపారు.
కాశ్మీర్ లోని ఒక పేద కుటుంబంలో జన్మించి, ఇంటర్ చదివిన ఆదిల్.. అమర్నాథ్ యాత్ర సమయంలో పహల్గాంకు వచ్చే పర్యాటకుల కోసం పోనీ గైడ్గా పనిచేసేవాడు. యాత్రికుల్ని గుర్రంపై తీసుకెళ్లి వాళ్లకి అక్కడి ప్రదేశాలు చూపిస్తూ, వాటి గురించి వివరించేవాడు. ప్రతీ రోజులానే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రమూక పర్యాటకులపై కాల్పులు జరుపుతోంది. దీంతో ఆదిల్ ఎంతో ధైర్య సాహసాలతో ఉగ్రవాదుల నుండి తుపాకీని లాక్కొని పర్యాటకుల్ని రక్షించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. దీంతో ఉగ్రమూక ఆదిల్ని గన్తో కాల్చి పొట్టన బెట్టుకున్నారు.
కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో ఐదుగురు సభ్యుల ఉగ్రమూక, అక్కడి మైదానంలో విహరిస్తున్న పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మారణహోమానికి ఆదిల్ అహ్మద్ థోకర్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహించినట్టు గుర్తించారు. ఇతడు పాకిస్తాన్ లో శిక్షణ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి ఇతర ఉగ్రవాదులతో సమన్వయం చేసుకుని, పర్యాటకులపై దాడికి పాల్పడ్డట్టు సమాచారం. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి దాదాపు100 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం, తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడం జరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
తెలంగాణ గవర్నర్ను కలిసిన బాలకృష్ణ
Read Latest Telangana News and National News