Israel: ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:15 AM
ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా... శుక్రవారం ఆ దేశంపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో (టెహ్రాన్ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో)..

100 సైనిక, అణు, క్షిపణి స్థావరాలే లక్ష్యం
200 యుద్ధవిమానాలతో తెల్లవారుజామున దాడి
330 బాంబులు, క్షిపణులు కురిపించిన ఇజ్రాయెల్
ఆర్మీ చీఫ్, ఐఆర్జీసీ చీఫ్ సహా నలుగురు సైనిక
జనరళ్లు, ఆరుగురు అణు శాస్త్రవేత్తల మృతి
నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం ధ్వంసం
కలిసికట్టుగా ఇజ్రాయెల్ సైన్యం, మొసాద్ ఆపరేషన్
ఇరాన్లోకి డ్రోన్లు, ఆయుధాలు అక్రమంగా చేరవేత
‘ట్రూ ప్రామిస్ 3’ పేరుతో ఇరాన్ ఎదురుదాడి
ఇజ్రాయెల్పైకి వందలాది క్షిపణులు, రాకెట్లు
టెల్ అవీవ్, టెహ్రాన్, జూన్ 13: ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా... శుక్రవారం ఆ దేశంపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో (టెహ్రాన్ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో).. ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 200కు పైగా యుద్ధవిమానాలు భీకర దాడులకు దిగాయి. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో దశలవారీగా జరిపిన ఈ దాడుల్లో భాగంగా.. ఇరాన్ అణు శుద్ధి కర్మాగారాల్లో అత్యంత ప్రధానమైన నతాంజ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, డజన్ల కొద్దీ రేడార్ కేంద్రాలు, సర్ఫే్స-టు-ఎయిర్ మిసైల్ లాంచర్లు సహా వివిధ నగరాల్లోని 100 లక్ష్యాలపై 330కు పైగా బాంబులు, క్షిపణులను ప్రయోగించాయి. ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ చీఫ్ హొస్సేన్ సలామీ, ఆర్మీ చీఫ్ మొహమ్మద్ బాఘేరీ సహా నలుగురు సైనిక జనరళ్లు, కనీసం ఆరుగురు అణు శాస్త్రవేత్తలు, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మరణించారు. ‘ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్’ ఎయిర్ఫోర్స్ విభాగానికి చెందిన అగ్రనాయకత్వం సమావేశమైన ఒక అండర్గ్రౌండ్ కమాండ్ సెంటర్పై తమ యుద్ధవిమానాలు చేసిన దాడిలో పలువురు అధికారులు చనిపోయినట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు. కాగా.. శుక్రవారం రాత్రి సమయంలో కూడా ఇరాన్లోని ఫోర్డో అణు శుద్ధి కేంద్రం వద్ద రెండు పేలుళ్లు జరిగినట్టు సమాచారం.
ఇరాక్తో యుద్ధం తర్వాత.. ఇరాన్పై జరిగిన అతిపెద్ద దాడులు ఇవే. నిజానికి ఇజ్రాయెల్ దాడుల ముప్పును ముందే ఊహించి.. నతాంజ్లోని తన యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఇరాన్ భూమికి 22 మీటర్ల లోతున, 2.5 మీటర్ల మందం ఉండే కాంక్రీట్ గోడలతో నిర్మించింది. అయినా ఇజ్రాయెల్ దాన్ని బంకర్ బస్టర్ బాంబులతో బద్దలుగొట్టింది. తమ దాడుల్లో ఆ కేంద్రం దెబ్బతిన్నట్టు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఇరాన్ అణు ఇంధన సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా.. నతాంజ్ (ఇరాన్)లోని అణు శుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడిని ధ్రువీకరించింది. అక్కడ అణుధార్మికత స్థాయులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. ఇక.. తమ దేశంలోని పౌర ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. రక్తపు మరకలు అంటిన చేతులతో ఇజ్రాయెల్ ఈ నేరానికి పాల్పడిందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. తాము చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ 100 డ్రోన్లను ప్రయోగించిందని... వాటిని తమ గగనతలానికి ఆవలే అడ్డుకుని కూల్చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఆ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాము ఎలాంటి డ్రోన్లనూ ప్రయోగించలేదని.. త్వరలోనే ప్రతీకార దాడి చేస్తామని స్పష్టం చేసింది. ఇక.. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని పలు దేశాలు ఖండించాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నేతలు సంయమనం పాటించాల్సిందిగా ఇరు దేశాలకూ సూచించారు. ఇరాన్ అండతో పనిచేసే లెబనీస్ మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా కూడా.. ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో చనిపోయినవారికి సానుభూతి తెలిపింది.
మావి ముందుజాగ్రత్త దాడులే..
ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలాకాలంగా వ్యతిరేకిస్తూ వస్తున్న ఇజ్రాయెల్.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేయకుండా ఆపడానికి తాము కట్టుబడి ఉన్నామని చాలాసార్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే.. మూడో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని, మరింత అధునాతనమైన సెంట్రీఫ్యూజ్లను ఏర్పాటు చేస్తామని ఇరాన్ గురువారం చేసిన ప్రకటనతో అప్రమత్తమై ఈ దాడులకు పాల్పడినట్టు భావిస్తున్నారు. దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనం. ‘‘టెహ్రాన్ నియంతలు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ నాశనానికి బహిరంగంగా, నిస్సిగ్గుగా పిలుపునిస్తున్నారు. అందుకోసం అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవలికాలంలో ఇరాన్ తొమ్మిది అణుబాంబులు చేయడానికి కావల్సిన శుద్ధి చేసిన యురేనియాన్ని ఉత్పత్తి చేసింది. ఇజ్రాయెల్ మనుగడకే ఇది పెనుముప్పు. ఇరాన్ పాలకుల అణు మారణహోమానికి మా దేశం బలి కాకుండా చూసుకుంటాను’’ అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణు, సైనిక స్థావరాలను, ఇరాన్ అణు కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న అధికారులను, సైనికాధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్టు ఆయన స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా.. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి గుండెకాయ లాంటి నతాంజ్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీపై తాము దాడి చేశామని.. తాము చేసిన ఈ దాడులు విజయవంతమయ్యాయని.. దేవుడి సహాయంతో తాము మరిన్ని విజయాలు సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న మతరాజ్య పతనం ఈ దాడులతోనైనా మొదలవుతుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.
మమ్మల్ని రక్షించండి..
దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత ప్రధానమంత్రి మోదీ సహా పలు దేశాల అధినేతలకు ఫోన్లు చేశారు. నెతన్యాహు నుంచి తనకు ఫోన్కాల్ వచ్చిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. నెతన్యాహుకు భారత్ ఆందోళనల గురించి, ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరతలు నెలకొనాల్సిన అవసరం గురించి తాను ఆయనకు వివరించానని చెప్పారు. మరోవైపు.. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తాము తీవ్ర భయాందోళనలకు గురవుతున్నామని, తమను వెంటనే భారత్కు తరలించాలని ఇరాన్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇరాన్ నడిబొడ్డునఇజ్రాయెల్ డ్రోన్ల స్థావరం
ఇరాన్పై తాము చేపట్టిన ఈ ఆపరేషన్ వెనుక ఎన్నో ఏళ్ల ప్రణాళిక, విస్తృత అధ్యయనం ఉన్నాయని.. తమ సైన్యం, తమ గూఢచార సంస్థ మొస్సాద్, తమ దేశంలోని రక్షణ పరిశ్రమలు.. కలిసి దీన్ని చేపట్టాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖకు చెందిన అధికారులు తెలిపారు. ఇరాన్పై తమ యుద్ధవిమానాలు దాడి చేసే సమయంలో, ఆ దేశ రక్షణ వ్యవస్థలు పనిచేయకుండా నిర్వీర్యం చేసే ప్రత్యేక ఆయుధాలను, స్ట్రైక్ సిస్టమ్స్ను తమ కమాండోలు ఆ దేశంలోకి ఎప్పుడో అక్రమ మార్గాల ద్వారా ప్రవేశపెట్టినట్టు వారు వివరించారు. మొస్సాద్ ఏజెంట్లు భారీగా పేలుడు పదార్థాలు నింపిన కార్లను ఇరాన్వ్యాప్తంగా సిద్ధంగా ఉంచారని చెప్పారు. అన్నింటికీ మించి.. ఇరాన్ రాజధాని టెహ్రాన్కి సమీపంలోనే విధ్వంసకర డ్రోన్లతో ఏకంగా ఒక బేస్నే ఏర్పాటు చేశారని.. దాడి మొదలుకాగానే వాటిని ఉత్తేజితం చేసి టెహ్రాన్కు సమీపంలోని మిసైల్ లాంచర్లపైకి ప్రయోగించారని, ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధంసం చేశారని.. దీంతో తమ దాడులకు అడ్డు లేకుండా అయిందని ఆ అధికారులు వివరించారు.
ఇప్పటికైనా అణు ఒప్పందం కుదుర్చుకోండి: ట్రంప్
ఇకనైనా ఇరాన్ తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని.. లేకపోతే తదుపరి దాడులు మరింత క్రూరంగా, నిర్దయగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆయన తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్సోషల్ ద్వారా స్పందించారు. తదుపరి దాడులకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని.. అవి మరింత క్రూరంగా ఉంటాయని అందులో పేర్కొన్నారు. ‘‘నేను ఎంత చెప్పినా ఇరాన్ నేతలు కొందరు ధైర్యంగా మాట్లాడారు. కానీ, ఏం జరగబోతోందో వారికి తెలియదు. ఇప్పటికే వారంతా చనిపోయారు. ఇది మరింత ఘోరంగా మారబోతోంది’’ అని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్లో ఎంతో విధ్వంసం జరిగిందని, ఎన్నో మరణాలు సంభవించాయని.. ఇప్పటికీ సమయం మించిపోలేదని, మొత్తం నాశనమైపోయేలోగా ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని .. ఒకప్పుడు ఎంతో పేరొందిన ఇరానియన్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ‘‘ఇక చావులు ఉండవు. విధ్వంసం ఉండదు. ఆలస్యం కాకముందే చేయండి (ఒప్పందం కుదుర్చుకోండి). దేవుడు మిమ్మల్ని దీవించుగాక’’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకు మరో సంచలన పోస్టు పెట్టారాయన. ‘‘అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటూ రెండు నెలల క్రితం ఇరాన్కు నేను 60 రోజుల అల్టిమేటమ్ ఇచ్చాను. వారు కుదుర్చుకుని ఉండాల్సింది. ఇవాళ 61వ రోజు. ఏం చేయాలో నేను వారికి చెప్పాను. కానీ, వారు చేయలేదు. ఇప్పుడు వారికి బహుశా రెండో అవకాశం ఉంది’’ అని అందులో పేర్కొన్నారు. అంతకుముందు.. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులపై ‘ఏబీసీ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇరాన్పై ఇజ్రాయెల్ అద్భుతంగా దాడులు చేస్తోందని ప్రశంసించారు. కాగా.. ఇరాన్పై దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో స్పష్టం చేశారు.
‘ట్రూ ప్రామిస్ 3’ పేరుతో ఇరాన్ ఎదురుదాడి
తమ దేశంపై దాడికి ప్రతిగా ఇరాన్ ‘ట్రూ ప్రామిస్ 3’ పేరుతో.. ఇజ్రాయెల్పై ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆ దేశంపైకి వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తాసంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అలాగే.. తమ గగనతలంలోకి వచ్చిన రెండు ఇజ్రాయెలీ యుద్ధవిమానాలను ఇరాన్ సైన్యం కూల్చేసినట్టు తెలిపింది. మరోవైపు.. ఇరాన్ నుంచి డజన్ల కొద్దీ క్షిపణులు దూసుకొచ్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం నిర్ధారించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలెం గగనతలంలోకి రాకెట్లు దూసుకొచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడుల్లో ఏడుగురు పౌరులు స్వల్పంగా, ఒకమాదిరిగా గాయపడినట్లు స్థానిక అత్యవసర సేవల విభాగాధిపతి తెలిపారు. తమ యుద్ధవిమానాలు టెహ్రాన్కు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలోని ఇస్ఫాహన్లో ఉన్న అణుస్థావరంపై దాడి చేసినట్టు ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్కడ వందలాది అణు శాస్త్రవేత్తలు, మూడు చైనీస్ రిసెర్చ్ రియాక్టర్లు ఉన్నట్టు పేర్కొంది.
మృతుల్లో ప్రముఖులు.. సైనిక జనరళ్లు
మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరీ: ఇరాన్ ఆర్మీ చీఫ్. సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాతి అత్యున్నతస్థాయి కమాండర్.
జనరల్ హొస్సేన్ సలామీ: ఇరాన్ ప్రధాన సైనిక శక్తి ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్’ అధిపతి.
జనరల్ గులాం అలీ రషీద్: ఇరాన్ సాయుద బలగాల డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్.
జనరల్ అమీర్ అలీ హాజీజాదే: ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఎయిర్స్పేస్ విభాగాధిపతి. (ఇజ్రాయల్ను సర్వనాశనం చేస్తానని ఈయన పలు బహిరంగ వేదికలపై ప్రకటించారు).
అణు శాస్త్రవేత్తలు
ఫెరెదౌన్ అబ్బాసీ: ఇరాన్ అణు ఇంధన సంస్థ మాజీ చీఫ్
మొహమ్మద్ మెహదీ టెహ్రాన్జీ: థియరిటికల్ ఫిజిసిస్ట్, ఇస్లామిక్ ఆజాద్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు.
సయ్యద్ అమీర్ హొస్సేన్ ఫెఖీ: షహీద్ బెహెస్తి యూనివర్సిటీ ఆఫ్ టెహ్రాన్లో.. న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫేకల్టీ సభ్యుడు. ఇరాన్ అణు ఇంధన సంస్థ డిప్యూటీ చీఫ్.
..వీరితోపాటు మరో ముగ్గురు అణు శాస్త్రవేత్తలు అబ్దుల్ హమీద్ మినూచెరహ్, అహ్మద్ రెజా జోల్ఫఖారీ, మత్లబీజాదే్హ కూడా మరణించారు. ఈ దాడుల్లో అణుశాస్త్రవేత్త మత్లబీజాదే్హ భార్య కూడా మరణించినట్టు సమాచారం.
రాజకీయ నాయకుడు
అలీ షమ్ఖానీ: ఇరాన్లోని అత్యంత ప్రభావశీల రాజకీయ నాయకుల్లో ఒకరు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు. అమెరికాతో ఇరాన్ జరుపుతున్న అణు చర్చల్లో కీలక వ్యక్తి.