Share News

ఏకకాలంలో మూడు యుద్ధాలు!

ABN , Publish Date - Jun 15 , 2025 | 06:08 AM

ఇరాన్‌తోపాటు.. గాజా, లెబనాన్‌పై ఏకకాలంలో మూడు యుద్ధాలు చేస్తున్నట్లు ఐడీఎఫ్‌ వివరించింది. గాజాలో జరిపిన తాజా దాడుల్లో 16 మంది చనిపోయారని పేర్కొంది.

ఏకకాలంలో మూడు యుద్ధాలు!

ఇరాన్‌తోపాటు.. గాజా, లెబనాన్‌పై ఏకకాలంలో మూడు యుద్ధాలు చేస్తున్నట్లు ఐడీఎఫ్‌ వివరించింది. గాజాలో జరిపిన తాజా దాడుల్లో 16 మంది చనిపోయారని పేర్కొంది. ఇక ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగబోదని తాము భావిస్తున్నట్లు రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కెట్జ్‌, ఐడీఎఫ్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ ఎఫీ డఫెరిన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఇరాన్‌లోని 150 లక్ష్యాలపై దాడులు చేశామని చెప్పారు. తమ వైమానిక దళాల వ్యూహాలను ఇరాన్‌ తట్టుకోలేదని స్పష్టంచేశారు. ప్రధాని నెతన్యాహు కూడా అణు కేంద్రాలపై దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని, మున్ముందు ఇంకా భారీగా దాడులు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు జరపనున్న విషయం తమకు ముందుగానే తెలుసునని ట్రంప్‌ పేర్కొన్నారు.


వెయ్యి క్షిపణులతో ప్రణాళిక

ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ ఇజ్రాయెల్‌పై దాడికి వెయ్యి బాలిస్టిక్‌ క్షిపణులను సిద్ధం చేయాలని జాతీయ భద్రత మండలి(ఎన్‌ఎ్‌ససీ) సమావేశంలో ఆదేశించారంటూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే.. ముందుగానే ఉప్పందుకున్న ఇజ్రాయెల్‌.. శుక్రవారం ఉదయం నుంచే టెహ్రాన్‌కు చెందిన క్షిపణి కేంద్రాలపై విరుచుకుపడింది. దీంతో.. ప్రతీకార దాడుల్లో ఇరాన్‌ 200 వరకు క్షిపణులను మాత్రమే వాడగలిగిందని ఆ కథనం వెల్లడించింది. కాగా.. ఇరాన్‌ వద్ద 2 వేల బాలిస్టిక్‌ క్షిపణులున్నట్లు ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ సీనియర్‌ అధికారిని ఉటంకిస్తూ ఫాక్స్‌న్యూస్‌ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. వచ్చే రెండేళ్లలో ఇరాన్‌ తన బాలిస్టిక్‌ క్షిపణుల సామర్థ్యాన్ని 8 వేలకు పెంచేదిశలో అడుగులు వేస్తున్న సమయంలో.. ఇజ్రాయెల్‌ దాడులు జరిపినట్లు ఆ కథనం వివరిస్తోంది. ఇరాన్‌పై దాడులకు బాలిస్టిక్‌ క్షిపణుల పెంపు ప్రయత్నమే కారణమని ఆ అధికారి వివరించినట్లు వెల్లడించింది. కాగా.. శనివారం పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి నిల్వల స్థావరాలపై దాడులు జరిపినట్లు ఐడీఎఫ్‌ వివరించింది.

Updated Date - Jun 15 , 2025 | 06:08 AM