Indus river projects: సింధు నదిపై భారీ ప్రాజెక్టులకు భారత్ శ్రీకారం.?
ABN , Publish Date - May 16 , 2025 | 04:10 PM
సింధు, జీలం, చీనాబ్ నదులపై కొత్తగా డ్యామ్లు, భారీ రిజర్వాయర్లు త్వరితగతిన నిర్మించాలని భారత్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడిలో

Indus River Projects: సింధు, జీలం, చీనాబ్ నదులపై కొత్తగా డ్యామ్లు, భారీ రిజర్వాయర్లు త్వరితగతిన నిర్మించాలని భారత్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్థాన్తో భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సింధు నది, దాని ఉప నదులైన జీలం, చీనాబ్ జల వనరుల్ని మరింత మెరుగ్గా ఉపయోగించుకునేందుకు ఆయా నదులపై కొత్త ప్రాజెక్టుల ప్రణాళిక, అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇందులో భాగంగా రణబీర్ కాలువను విస్తరించే ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇది భారత్ చేపట్టాలని భావిస్తోన్న కీలక ప్రణాళికలలో ఒకటి. రణబీర్ కాలువ పొడవును 120 కి.మీ.కు రెట్టింపు చేయాలని, తద్వారా సెకనుకు 150 క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించడానికి వీలు కలుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం దీని సామర్థ్యం 40 క్యూబిక్ మీటర్లు. దీంతోపాటు, సింధు, చీనాబ్, జీలం నదుల నుండి నీటిని మూడు ఉత్తర భారత రాష్ట్రాలలోని నదుల్లోకి తరలించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ చెబుతోంది. ప్రస్తుతం సింధు దాని ఉప నదులపై ఉన్న చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 3,360 మెగావాట్ల నుండి 12,000 మెగావాట్లకు పెంచాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.
కొత్తగా భారత్ ఈ నదులపై కనీసం ఐదు నీటి నిల్వ ప్రాజెక్టులను గుర్తించిందని, వాటిలో నాలుగు చీనాబ్, జీలం ఉపనదులపై ఉన్నాయని తెలిపింది. కాగా, పాకిస్తాన్లోని దాదాపు 80% పంట పొలాలకి, అన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా సింధు నీటి ప్రవాహంపై ఆధారపడి ఉన్నాయి. పాకిస్తాన్ తో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత మే ప్రారంభంలో పాకిస్తాన్లోని కీలకమైన ప్రాజెక్టుల్లో నీరు 90% వరకు తగ్గిందని చెబుతున్నారు. సింధు నది టిబెట్లోని మానసరోవర్ దగ్గర ఉద్భవించి, అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది భారత్ లోని ఉత్తర, పాకిస్తాన్ లోని తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లో ప్రవహిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో 50 వేల కోట్ల నిధులు
Indian Army Encounter: పల్వామాలో ఎన్కౌంటర్.. 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డప్పు బాజాలు