Indigenous Weapons: ఆ డ్రోన్లు బెంగళూరులో తయారైనవే
ABN , Publish Date - May 09 , 2025 | 05:13 AM
ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులతో పాటు బెంగళూరులో తయారైన స్కై-స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను ఉపయోగించింది. ఈ డ్రోన్లు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

ఆపరేషన్ సిందూర్తో అరంగేట్రం
న్యూఢిల్లీ, మే 8: పాక్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కోసం భారత సైన్యం అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది. వీటిలో స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హ్యామర్ బాంబులతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆత్మాహుతి డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ సహకారంతో బెంగళూరుకు చెందిన అల్ఫా డిజైన్ టెక్నాలజీస్ లిమిటెడ్(ఏడీటీఎల్) అభివృద్ధి చేసిన స్కై-స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లు ఈ ఆపరేషన్ సందర్భంగా అరంగేట్రం చేశాయి. శత్రు శిబిరాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి విరుచుకుపడేందుకు వీలుగా వీటిని రూపొందించారు.ఈ లాయిటరింగ్ మ్యూనిషన్లు 5 కిలోల వార్హెడ్ను మోసుకెళ్లగలవు. సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఈ డ్రోన్లు 100 కిలోమీటర్ల పరిధిలో ఆకాశంలో తిరుగుతూ, లక్ష్యాన్ని నేరుగా ఢీకొట్టి విధ్వంసం సృష్టిస్తాయి. కామికేజ్ డ్రోన్లుగా పిలిచే ఈ ఆత్మహుతి డ్రోన్ల తయారీ ఖర్చు కూడా చాలా తక్కువే. ఇటువంటి 100 యూఏవీల కొనుగోలు కోసం 2021లో ఒప్పందం చేసుకొని భారత సైన్యంలో ప్రవేశపెట్టారు.