Indian Army Chief Warning: మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
ABN , Publish Date - Nov 01 , 2025 | 09:46 AM
ఆపరేషన్ సిందూర్ ముగియలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టం చేశారు. పాక్ మరో మూర్ఖపు చర్యకు దిగితే తాము ఆపరేషన్ సిందూర్ రెండో రౌండ్కు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్ఘానిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్పై నోరు పారేసుకుంటున్న పాక్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్ మళ్లీ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే ఆపరేషన్ సిందూర్ రెండో రౌండ్కు తాము రెడీగా ఉన్నామని అన్నారు (Indian Army Chief Upendra Dwivedi Warning).
‘ఆపరేషన్ సింధూర్ 2.0కు భారత సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ముగ్గురు స్నేహితులు (త్రివిధ దళాధిపతులు) సాయుధ దళాలను ముందుండి నడిపిస్తే మమల్ని ఎవరూ ఎదుర్కోలేరు’ అని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలోని సైనిక్ స్కూల్ను సందర్శించిన ఆయన ఈ హెచ్చరిక చేశారు. ఆపరేషన్ సిందూర్ ముగింపు ఎప్పుడో భారత్ తప్ప ఇతరులెవరూ నిర్ణయించలేరని కూడా తేల్చి చెప్పారు. పాక్ తగిన గుణపాఠం నేర్చుకుందని తాము భావించినప్పుడే ఆపరేషన్ సిందూర్ ముగుస్తుందని అన్నారు (Operation 2.0).
సైన్యానికి నేతృత్వం వహిస్తున్న లెఫ్టెనెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, నావికాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ ఇద్దరూ 1970ల్లో కలిసి చదువుకున్నారు. అప్పట్లో రేవా సైనిక్ స్కూల్లో క్లాస్ 5ఏ తరగతిలో క్లాస్ మేట్స్గా ఉన్నారు. ఆ తరువాత ఇద్దరు అంచెలంచెలుగా ఎదుగుతూ సాయుధ దళాల అధిపతులయ్యారు.
భారత్తో యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇటీవల పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈసారి యుద్ధంలో తాము గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఛీప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడికి ప్రతీకారంలో భారత్ మే 6,7 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేసి పాక్ పాలక వర్గానికి, అక్కడి ఉగ్రమూకలకు వెన్నులో వణుకు పుట్టించింది.
ఇవి కూడా చదవండి:
చంపుతామంటూ బీజేపీ ఎంపీకి ఫోనులో బెదిరింపులు
తల్లిని దారుణంగా చంపిన కూతురు.. ప్రియుడితో కలిసి బాబోయ్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి