Boeing: బోయింగ్ల కుదింపు?
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:26 AM
ఎయిరిండియా వద్ద ఉన్న బోయింగ్ విమానాల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది. అహ్మదాబాద్లో గురువారం బోయింగ్ డ్రీమ్లైనర్ 787 విమానం కూలిన ఘోర దుర్ఘటన తర్వాత సదరు ఫ్లైట్లలో సాంకేతిక లోపాలపై విస్తృతంగా చర్చ మొదలైంది.

ఎయిరిండియాలో వాటి సేవలపై కేంద్రం యోచన
తొలుత సాంకేతిక తనిఖీలకు ఆదేశం
రేపటి నుంచే సోదాలు చేయాలని నిర్దేశం
దేశంలోని అన్ని విమానయాన సంస్థల్లో కలిపి మొత్తం 209 బోయింగ్లు
ఒక్క ఎయిరిండియా వద్దే 135
న్యూఢిల్లీ, జూన్ 13: ఎయిరిండియా వద్ద ఉన్న బోయింగ్ విమానాల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది. అహ్మదాబాద్లో గురువారం బోయింగ్ డ్రీమ్లైనర్ 787 విమానం కూలిన ఘోర దుర్ఘటన తర్వాత సదరు ఫ్లైట్లలో సాంకేతిక లోపాలపై విస్తృతంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాల సేవల తగ్గింపుపై కేంద్రం దృష్టి సారించింది. ఈ సంస్థ విమానాలన్నిటినీ భద్రతాపరంగా సమీక్షించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే భారత, అమెరికా సంస్థల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దర్యాప్తు ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. అటు విమానాల నిర్వహణలో ప్రామాణిక ఆపరేటింగ్ ప్రక్రియను ఎయిరిండియా అనుసరిస్తున్నదీ లేనిదీ కూడా పరిశీలించనున్నట్లు పేర్కొన్నాయి. దానికి ముందుగా బోయింగ్ విమానాలన్నిటినీ ఒకసారి సాంకేతికంగా తనిఖీ చేయాలని డీజీసీఏ శుక్రవారం ఆదేశించింది.
ప్రమాదాలను నివారించేందుకు జెన్ఎక్స్ ఇంజన్లు కలిగిన బోయింగ్ బీ787-8/9 విమానాల నిర్వహణకు సంబంధించి తక్షణమే అదనపు తనిఖీలు చేపట్టాలని అధికారిక ప్రకటనలో పేర్కొంది. ‘ఆదివారం నుంచి ప్రతి బోయింగ్ ఫ్లైట్ బయల్దేరబోయే ముందు అన్నీ ఒకసారి కూలంకషంగా తనిఖీ చేయాలి. ఇంధన పారామీటర్ మానిటరింగ్, దాని అనుబంధ వ్యవస్థలను.. క్యాబిన్ ఎయిర్ కంప్రెషర్, అనుబంధ వ్యవస్థలను పరిశీలించాలి. ఎలకా్ట్రనిక్ ఇంజన్ కంట్రోల్-సిస్టమ్ టెస్ట్, ఇంజన్ ఫ్యుయెల్ డ్రివెన్ యాక్యురేటర్-ఆపరేషన్ టెస్ట్ చేపట్టాలి. హైడ్రాలిక్ సిస్టమ్ సామర్థ్యాన్ని తనిఖీ చేయాలి. టేకాఫ్ పారామీటర్లను సమీక్షించాలి. తదుపరి ఆదేశాలు వెలువడేదాకా ఫ్లైట్ కంట్రోల్ తనిఖీలు చేపట్టాలి. గత 15 రోజుల్లో బీ787-8/9 విమానాల్లో తరచూ తలెత్తిన లోపాలను సమీక్షించాలి. సోదాల నివేదికను డీజీసీఏకి సమర్పించాలి’ అని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, భారత విమానయాన సంస్థలు బోయింగ్ విమానాలనే ఎక్కువగా నడుపుతున్నాయి. అన్ని విమానయాన సంస్థల వద్ద మొత్తం వివిధ రకాల బోయింగ్లు 209 వరకు ఉన్నాయి. వీటిలో 139 ఒక్క ఎయిరిండియా వద్దే ఉన్నాయి.
కొనుగోలు ఆర్డర్లు కుదింపు?
వాస్తవానికి విమానాల సరఫరాకు బోయింగ్ పలు సంస్థలు, దేశాలతో ఒప్పందం చేసుకుంటున్నా.. వాషింగ్టన్, ఒరెగాన్ ప్లాంట్లలో సమ్మెలు, ఇతర సమస్యల కారణంగా సకాలంలో ఇవ్వలేకపోతోంది. ఈ కారణంగా కొనుగోలు సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలా విమానయాన సంస్థలు తమ తమ ఆర్డర్లను కుదించుకుని ఇతర విమాన తయారీ కంపెనీల వైపు చూస్తున్నాయని అంటున్నారు. మొత్తం కొత్త విమానాలనే నడపాలన్న ఉద్దేశంతో ఎయిరిండియా 2023లో 220 జెట్ల కోసం బోయింగ్కు ఆర్డర్లు ఇచ్చింది. ఇవి గాక అదనంగా 50 మ్యాక్స్ (737), 20 డ్రీమ్లైనర్లు (787) విమానాల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తూ సంతకాలు కూడా చేసింది. అలాగే 200 సింగిల్ ఐసిల్ జెట్ల కోసం ఎయిర్బస్, బోయింగ్లతో చర్చలు జరుపుతోంది. ఇండిగో 900 విమానాల కోసం ఎయిర్బ్సకు ఆర్డర్లు ఇచ్చింది. మూడేళ్ల కిందట కార్యకలాపాలు మొదలుపెట్టిన ఆకాశ్ ఎయిర్ కూడా 226 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. అయితే బోయింగ్ ఒక్క విమానం కూడా సరఫరా చేయలేదు. ఇప్పుడు అహ్మదాబాద్ ప్రమాదం కారణంగా బోయింగ్ విమానాలను భద్రతాపరంగా స్ర్కుటినీ చేస్తున్న నేపథ్యంలో సరఫరాలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,148 డ్రీమ్లైనర్లు ఉన్నాయి.
బాంబు బెదిరింపుతో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్
థాయిలాండ్లోని పుకెట్ నుంచి శుక్రవారం ఉదయం ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తిరిగి పుకెట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 156 మంది ప్రయాణికులతో పుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 9.30(స్థానిక కాలమానం ప్రకారం)కు ఢిల్లీ బయలుదేరిన ఏఐ 379 విమానం అండమాన్ సముద్రం పైకి చేరుకున్నాక బాంబు బెదిరింపు రావడంతో వెనుదిరిగి పుకెట్విమానాశ్రయంలో దిగింది. విమానంలోని 156 మంది ప్రయాణికులను సురక్షితంగా దించి పూర్తిస్థాయిలో తనిఖీలు చేసినట్లు థాయిలాండ్ విమానాశ్రయాల అధికారి ఒకరు తెలిపారు. లైవ్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్24లో ఈ విమానం మధ్యలోనే వెనుదిరగడం కనిపించింది.