Chandrayaan 5: చందమామ పిలుస్తోంది..
ABN , Publish Date - May 17 , 2025 | 04:57 AM
చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించిన భారత్.. ప్రస్తుతం చంద్రయాన్ సిరీ్సలో మరో రెండు ప్రాజెక్టు పనుల్లో తలమునకలైంది. వీటిలో చంద్రయాన్-4 ఇప్పటికే అభివృద్ధి దశలో ఉండగా..

చంద్రయాన్-5కు రెడీ అవుతున్న భారత్
జపాన్ సహకారంతో ఇస్రో మరో మిషన్
జాబిల్లి దక్షిణ ధ్రువ అన్వేషణకు ‘లూపెక్స్’
ఉపరితలం, నీటి జాడలపై అన్వేషణ
న్యూఢిల్లీ, మే 16: చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించిన భారత్.. ప్రస్తుతం చంద్రయాన్ సిరీ్సలో మరో రెండు ప్రాజెక్టు పనుల్లో తలమునకలైంది. వీటిలో చంద్రయాన్-4 ఇప్పటికే అభివృద్ధి దశలో ఉండగా.. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ (లూపెక్స్) మిషన్గా పిలిచే చంద్రయాన్-5కు కూడా ఇస్రో ఇటీవలే ఆమోదం కూడా పొందింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూన్ మిషన్ చంద్రయాన్-5 కోసం భారత్, జపాన్ చేతులు కలిపాయి. ఇస్రో, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) సంయుక్తంగా చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే ఆమోదం తెలిపింది. జపాన్కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా లూపెక్స్ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ ప్రయోగం 2027-28లో ఉండే అవకాశం ఉంది.
చంద్రయాన్-5 ఏం చేస్తుంది..
చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంపై అధ్యయనం చేయడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా చంద్రుడి ఉపరితలం, దాని కింద నీరు, మంచు నిక్షేపాల కోసం అన్వేషణపై దృష్టి పెడుతుంది. భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు ఈ పరిశోధనలు ఉపయోగపడనున్నాయి. అలాగే మానవ నివాసానికి కావలసిన వనరులు చంద్రుడిపై ఉన్నాయా... అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ అన్వేషణ ఉపయోగపడనుంది. చంద్రయాన్-5 మిషన్ ద్వారా 6.5 టన్నుల పేలోడ్ను కక్ష్యలోకి పంపిస్తారు. దీనిలో 250 కిలోల బరువుండే రోవర్ కూడా ఉంటుంది. అలాగే చంద్రయాన్-3లో ఉపయోగించిన ప్రజ్ఞాన్ కంటే పది రెట్ల బరువైన ల్యాండర్ను దీనిలో జాబిల్లిపైకి పంపుతారు. ఇవి చంద్రుడి ఉపరితలాన్ని విశ్లేషించి, శాస్త్రీయ ప్రయోగాలకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాయి.
నీటి జాడల అన్వేషణ..
జాక్సా అభివృద్ధి చేసిన రోవర్లో వాటర్ అనలైజర్లు, స్పెక్ట్రోమీటర్లు, గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్, చంద్రుడి ఉపరితలంపై నమూనాల ఆధారంగా నీటిశాతం, నాణ్యతను అంచనా వేయడానికి 1.5 మీటర్ల లోతు వరకు తవ్వగలిగే పరికరాలను అమర్చారు. కాగా, ల్యాండర్తోపాటు అనేక ఇతర శాస్త్రీయ పరికరాలను ఇస్రో సమకూర్చనుంది. అలాగే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎ్సఏ) వంటి అంతర్జాతీయ భాగస్వామ్యులు న్యూట్రాన్, మాస్ స్పెక్ట్రోమీటర్లతో సహా మరికొన్ని ప్రత్యేక పేలోడ్లను అందిస్తున్నాయి. ఈ మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న శాశ్వత నీడ ప్రాంతం (పీఎ్సఆర్) లక్ష్యంగా చేసుకుని పరిశోధనలు చేస్తుంది. ఈ ప్రాంతంలో నీటి, మంచు నిక్షేపాలు ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. రోవర్ 100 రోజులపాటు పరిశోధనలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. పరిస్థితులను బట్టి దీన్ని ఒక సంవత్సరం వరకూ పొడిగించే అవకాశం ఉంది.