Operation Sindoor: 600కు పైగా పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్..
ABN , Publish Date - May 16 , 2025 | 09:10 PM
పాక్ లెక్కకు మిక్కిలిగా డ్రోన్లతో భారత మిలిటరీ స్థావరాలపై దాడులకు తెగబడింది. అయితే భారత్ ఈ దాడులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో సమర్ధవంతంగా ఎదుర్కొని, పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడే గాలిలోనే కూల్చేసింది.

న్యూఢిల్లీ: పహల్గాంలో ఏప్రిల్ 22న 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు అమానుషంగా కాల్చిచంపడంతో అంతే వేగంగా ప్రతిగా భారత సాయుధ బలగాలు 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)తో పాక్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు జరిపింది. తొమ్మిది చోట్ల ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో పాక్ లెక్కకు మిక్కిలిగా డ్రోన్లతో భారత మిలిటరీ స్థావరాలపై దాడులకు తెగబడింది. అయితే భారత్ ఈ దాడులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో సమర్ధవంతంగా ఎదుర్కొని, పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడే గాలిలోనే కూల్చేసింది. ఆర్మీ సమన్వయంతో భారతీయ వాయుసేన 600కు పైగా పాక్ డ్రోన్లను కూల్చేసింది.
Indus Water Treaty: తుల్బుల్పై ఒమర్, మెహబూబా మాటల తూటాలు..
పాక్ డ్రోన్లను కూల్చివేయడానికి 1,000 గన్ సిస్టమ్లు, సుమారు 750 షార్ట్ అండ్ మీడియం రేంజ్ క్షిపణులను మోహరించినట్టు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో దాడులను ఊహించిన ఇండియన్ మిలిటరీ ముందస్తుగా జాయింట్ ఎయిర్ డిఫెన్స్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇక్కడ్నుంచే డ్రోన్ దాడులను తిప్పికొట్టడం, కీలకమైన వ్యూహాత్మక ఎస్సెట్స్ను పరిరక్షించుకోవడం జరిగింది.
వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత్..
భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పాక్ బలగాలను బోల్తా కొట్టించింది. కంబాట్ డ్రోన్లను పోలిన డమ్మీ ఎయిర్క్రాఫ్ట్లను మిలటరీ మోహరించింది. దీంతో భారత్ ఫైటర్ జెట్లు తమ గగనతంలోకి అడుగుపెట్టినట్టు అనుమానించిన పాకిస్థాన్ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను యాక్టివేట్ చేసింది. దీంతో కీలకమైన మిలిటరీ ఎస్సెట్స్ లొకేషన్లను పాక్ బయటపెట్టినట్టయింది. వెంటనే ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్ కీలక ఎయిర్బేస్లపై భారత్ విరుచుకుపడింది. దీంతో ఆయోమయంలో చిక్కిన పాక్ బలగాలు భారత్ దాడులను తిప్పికొట్టలేక తోకముడిచాయి.
11 ఎయిర్ బేస్లు ధ్వంసం..
ఈ ఆపరేషన్లో పాక్కు చెందిన 11 ఎయిర్బేస్లు బాగా దెబ్బతినట్టు భారత అధికారుల సమాచారం. అత్యంత వ్యూహాత్మకమైన భొలారి ఎయిర్బేస్లోని కీలక ఏడబ్ల్యుఏసీఎస్ సిస్టమ్ను భారత్ ధ్వంసం చేసినట్టు పాకిస్థాన్ మాజీ ఎయిర్ మార్షల్ ఒకరు వెల్లడించారు. కాగా, భారత్ బలగాలు జరిపిన దాడి ట్రయిల్ మాత్రమేనని, సమయం వచ్చినప్పుడు పూర్తి సినిమా చూపిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. గుజరాత్లోని భుజ్ ఎయిర్ బేస్ను శుక్రవారం నాడు సందర్శించిన సందర్భంగా పాక్ను హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో 50 వేల కోట్ల నిధులు
Indian Army Encounter: పల్వామాలో ఎన్కౌంటర్.. 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం..