Rajnath Singh: లక్ష కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోళ్లు
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:12 AM
దేశ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.05 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాలను కొనుగోలు చేయనుంది...

ఆమోదం తెలిపిన డీఏసీ
న్యూఢిల్లీ, జూలై 3: దేశ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.05 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాలను కొనుగోలు చేయనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) 10 రకాల రక్షణ సామగ్రి కొనుగోళ్లకు పచ్చజెండా ఊపింది. ఈ పరికరాలన్నీ మేకిన్ ఇండియాలో భాగంగా భారత్లో తయారై ఉండాలని స్పష్టం చేసింది.
తాజాగా డీఏసీ ఆమోదించిన పరికరాల్లో ఆర్మర్డ్ రికవరీ వాహనాలు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు, త్రివిధ దళాలకు ఉమ్మడి ఇంటిగ్రేటెడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్(ఐఐఎంఎస్), భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, నౌకాదళానికి మైన్స్, మైన్స్ కౌంటర్ మేజర్ వెసల్స్, సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్లు, జలాంతర్గాములు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు గాను యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ(ఏవోఎన్)ను తాజా సమావేశంలో డీఏసీ జారీ చేసింది.