Share News

Mining Case: గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు

ABN , Publish Date - May 28 , 2025 | 07:11 AM

Gali Janardhan Reddy: ఓబుళాపురం మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసులో శిక్ష పడటంతో గాలి జనార్దనరెడ్డి హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో ఉంటున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని ఆయన పలు అభియోగాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌తో బెంగళూరు పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి గాలి జనార్దనరెడ్డిని బెంగళూరుకు తరలించారు.

Mining Case: గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు
Gali Janardhan Reddy

Bengaluru: ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసు (Obulapuram illegal mining case)లో దోషిగా తేలి హైదరాబాద్‌లోని చంచల్‌ గూడ జైలు (Chanchalguda jail)లో శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి (Gali Janardhan Reddy)ని పోలీసులు బెంగళూరు (Bengaluru)కు తరలించారు. బెంగళూరులో ఆయనపై పలు కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో, అక్కడి పోలీసులు పీటీ వారెంట్‌ (PT warrant) ఆధారంగా ఆయనను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువెళ్లారు. గాలి జనార్దనరెడ్డితో పాటు అతని సహాయకుడు మెహఫుజ్‌ అలీఖాన్‌ (Mehfuz Ali Khan)ను కూడా బెంగళూరుకు తరలించారు.


ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసు..

గాలి జనార్దనరెడ్డి ఓబుళాపురం మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసులో శిక్ష పడటంతో హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో ఉంటున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కూడా ఆయన పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌తో బెంగళూరు పోలీసులు చంచల్‌గూడ జైలు అధికారులను సంప్రదించారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం గాలి జనార్దనరెడ్డిని తమ వెంట బెంగళూరుకు తీసుకెళ్లారు.

Also Read: 10న విశాఖకు రాష్ట్రపతి


నిబంధనల ఉల్లంఘన..

గనుల తవ్వకాల నిబంధనలను గాలి జనార్దనరెడ్డి ఉల్లంఘించారని.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన కొందరు గతంలో బెంగళూరులోని చట్టసభల ప్రతినిధుల న్యాయస్థానంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా నిందితులను వ్యక్తిగతంగా హాజరుపర్చాలని న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ ఆదేశించారు. దీంతో బెంగళూరు పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి వారిని తీసుకొచ్చి బెంగళూరులోని చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానంలో హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులకు రిమాండ్‌ విధించడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార కారాగారానికి తరలించారు. తదుపరి విచారణను జూన్‌ 2కు వాయిదా వేశారు.


మైనింగ్‌ కింగ్‌ ఎలా అయ్యారంటే..

కాగా బళ్లారిలో సాధారణ కానిస్టేబుల్‌గా పనిచేసిన చెంగారెడ్డి కుమారుడే మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దన్‌రెడ్డి. వాస్తవానికి చిత్తూరు జిల్లాకు చెందిన చెంగారెడ్డి కుటుంబం.. ఆ తర్వాత బళ్లారి వలస వెళ్లింది. ఆయన అత్యంత సాధారణమైన జీవితం నుంచి కోట్లకు పడగలెత్తి అత్యంత సంపన్నుడిగా ఆవిర్భవించడం వెనుక అక్రమ వ్యాపారాల చరిత్ర ఉంది. 1967లో బళ్లారిలో జన్మించిన జనార్దన్‌రెడ్డి.. కేవలం 21 ఏళ్ల వయసులో బళ్లారిలో ‘ఎన్నోబుల్‌ ఇండియా సేవింగ్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీ’ని ప్రారంభించి ప్రజల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు వసూలు చేశారు. ఎల్‌ఐసీకి ధీటైన సంస్ధ అంటూ ప్రచారంతో ఊదరగొట్టి సామాన్యుల నుంచి డిపాజిట్లు సేకరించారు. బళ్లారితోపాటు కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచీ పలువురు డిపాజిట్లు చేశారు. ఈ సంస్ధపై రిజర్వ్‌ బ్యాంక్‌కు పలు ఫిర్యాదులు రావడంతో ఎన్నోబుల్‌ సంస్ధను ఆర్‌బీఐ మూసివేయించింది. అప్పటికే పెద్దఎత్తున పొదుపు ఖాతాల్లో డబ్బు పెట్టిన వేల మంది ప్రజలు నష్టపోయారు. అదే సమయంలో గాలి జనార్దన్‌రెడ్డి తన సోదరులైన కరుణాకర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డితో కలిసి చిట్‌ఫండ్‌ వ్యాపారం ప్రారంభించారు. ఈ క్రమంలో మైనింగ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)ని ప్రారంభించారు. ఇనుప ఖనిజం అమ్మకాలతో భారీగా డబ్బు సంపాదించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ద్వారా ఓఎంసీకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మైనింగ్‌ లీజులు పొందారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌పై పవిత్ర యుద్ధమే లక్ష్యం

మహానాడు తొలిరోజు సైడ్‌ లైట్స్‌

For More AP News and Telugu News

Updated Date - May 28 , 2025 | 07:11 AM