Cargo Ship Fire: కార్గో నౌకలో మంటలు.. నలుగురు గల్లంతు..
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:29 PM
Kerala cargo ship: కేరళ తీరంలో కార్గో నౌక ఎంవీ వాన్ హై 503లో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఊహించని ఘటనతో నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టింది. నౌక అంతర్గత భాగంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.

తిరువనంతపురం: కేరళ (Kerala) తీరంలో కార్గో నౌకలో మంటలు (Cargo Ship Fire) చెలరేగాయి. నిన్న (సోమవారం) సింగపూర్ (Singapore)కు చెందిన ఎంవీ వాన్ హాయ్ (MV Wan Hi) 503 నౌకలో మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న 20 కంటైనర్లు (20 Containers) సముద్రంలో పడిపోయినట్లు సమాచారం. అలాగే నౌకలో 22 మంది వరకు సిబ్బంది ఉన్నట్లు తెలియవచ్చింది. సోమవారం ఉదయం 9:20 గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగింది. కేరళలోని కన్నూర్ జిల్లాలోని అఝిక్కల్ పట్టణ తీరం నుంచి 44 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది.
హఠాత్తుగా పేలుడు...
కేరళ తీరంలో కార్గో నౌక ఎంవీ వాన్ హై 503లో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఊహించని ఘటనతో నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టింది. నౌక అంతర్గత భాగంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. 270 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల పొడవున్న ఈ నౌక ఈనెల 7న కొలంబో తీరం నుంచి బయల్దేరింది. ఇది మంగళవారం నాటికి ముంబయికి చేరుకోవాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదానికి గురైంది.
నలుగురు గల్లంతు..
ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 18 మంది సముద్రంలోకి దూకారు. వారిని భారత్ నేవీ, ఐఎన్ఎస్ సూరత్ కోస్టు గార్డ్స్ వాళ్లను రక్షించి మంగళూరు పోర్టుకు తీసుకువచ్చారు. నలుగురు సిబ్బంది గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు తైవాన్, ఒకరు ఇండోనేషియా, ఒకరు మయన్మార్ వాసులుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో 5గురు గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తోంది. గల్లంతైనవారికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నౌక సముద్రంలో ఇంకా తేలియాడుతునే ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా గత 30 రోజుల్లో కేరళ సమీపంలో సరకు రవాణానౌక ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. మే 24న లైబీరియా జెండాతో వెళ్తున్న కార్గో నౌక తీరానికి 14.6 మైళ్లదూరంలో మునిగిపోయింది.
ఇవి కూడా చదవండి:
తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులు..?
ఎంపీల అఖిలపక్ష బృందాలతో మోదీ భేటీ
For More AP News and Telugu News