Share News

Haryana: చిన్నారులతో రైలుకి అడ్డం వెళ్లి..

ABN , Publish Date - Jun 12 , 2025 | 05:17 AM

హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఘోరం జరిగింది. భార్యపై కోపంతో ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో సహా రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

Haryana: చిన్నారులతో రైలుకి అడ్డం వెళ్లి..

  • భార్యపై కోపంతో నలుగురు పిల్లలతో సహా కూలీ ఆత్మహత్య

  • అడిగినవి కొనిచ్చి మరీ దారుణం.. హరియాణాలో ఘటన

గుర్‌గావ్‌, జూన్‌ 11 : హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఘోరం జరిగింది. భార్యపై కోపంతో ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో సహా రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌కు చెందిన మనోజ్‌ మహతో(36) అనే కూలీ మూడు నుంచి పదేళ్ల వయస్సున్న తన నలుగురు పిల్లలు చోటు(3), మురళి(5), కరు(9), పవన్‌(10)లను మంగళవారం మధ్యాహ్నం రైలు పట్టాలపైకి తీసుకువెళ్లాడు. గోల్డెన్‌ టెంపుల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దూసుకు వస్తుండగా పిల్లలు ప్రాధేయపడుతున్నా వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పిల్లలతో అతడు రైలు పట్టాలు దాటేందుకు వెళుతున్నాడని భావించామని స్థానికులు చెప్పారు. కాగా పిల్లల్ని పార్కుకు తీసుకువెళ్తున్నానని తనకు చెప్పాడని అతడి భార్య ప్రియ పోలీసులకు తెలిపింది.


అయితే మనోజ్‌ పిల్లల్ని పార్కుకు తీసుకువెళ్లకుండా రైలు పట్టాల దగ్గరకు తీసుకువెళ్లాడు. అక్కడి ఫ్లైఓవర్‌ కింద రైలు వచ్చేంత వరకు పిల్లలు అడిగిన చిప్స్‌, కూల్‌డ్రింకులు కొనిచ్చి గంట సేపు ఉంచాడు. అనంతరం ఎక్స్‌ప్రెస్‌ రైలు దూసుకువస్తుండగా ఘోరానికి పాల్పడ్డాడు. దుర్ఘటన తర్వాత లోకో పైలెట్‌ రైల్వేస్టేషన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మనోజ్‌ జేబులో అతడి భార్య ఫోన్‌ నెంబరు రాసి ఉండడాన్ని గుర్తించారు. దీంతో అతడు ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ చర్యకు పాల్పడ్డాడని భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గుర్తించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారిస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - Jun 12 , 2025 | 05:17 AM