Election Commission: ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:32 AM
జగదీప్ ధన్ఖడ్ రాజీనామా నేపథ్యంలో.. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

ఉభయ సభల సభ్యులతో ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటు
వీలైనంత త్వరలో షెడ్యూల్ ప్రకటన: ఈసీ
నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 30 రోజుల్లోగా పోలింగ్
న్యూఢిల్లీ, జూలై 23: జగదీప్ ధన్ఖడ్ రాజీనామా నేపథ్యంలో.. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈమేరకు ఉభయసభల సభ్యులతో ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్టు.. రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులను ఖరారు చేస్తున్నట్టు వెల్లడించింది. సన్నాహక చర్యలు పూర్తయ్యాక, వీలైనంత త్వరగా ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తామని వివరించింది.
నిబంధనల ప్రకారం.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి 30 రోజుల్లోగా పోలింగ్ జరగాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి..పార్లమెంటు ఉభయసభలకూ ఎన్నికైన సభ్యులతోపాటు, నామినేటెడ్ సభ్యులు కూడా అర్హులే.