EC vs Rahul Gandhi: వెనక్కి తగ్గని రాహుల్.. ఈసీ ముందు రెండు డిమాండ్లు
ABN , Publish Date - Jun 07 , 2025 | 09:59 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక డేటాను బహిరంగం చేయాలని ఈసీని రాహుల్ కోరారు. తీవ్రమైన అంశాలపై ఎగవేత ధోరణిలో ఈసీ స్పందించిందని విమర్శించారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం నాడు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆయన ఆరోపణలు నిరాధారమని ఎన్నికల కమిషన్ కొట్టిపారేసింది. ఈసీ స్పందించిన కొద్దిసేపటికే తిరిగి రాహుల్ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక డేటాను బహిరంగం చేయాలని ఈసీని డిమాండ్ చేశారు. తీవ్రమైన అంశాలపై ఎగవేత ధోరణిలో ఈసీ స్పందించిందని, కమిషన్ తన విశ్వసనీయతను పునరుద్ధరించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
''మీది రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ. సంతకం లేకుండా, మధ్యవర్తులతో ఎగవేత ధోరణిలో స్పందించడం సరైన పద్ధతి కాదు'' అని రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు. మహారాష్ట్రతో సహా ఇటీవల అన్ని రాష్ట్రాల్లో జరిగిన లోక్సభ, విధానసభల సమగ్రమైన డిజిటల్, మెషీన్-రీడబుల్ ఓటర్ల జాబితాను ప్రచురించాలని, మహారాష్ట్ర పోలింగ్ బూత్లతో సాయంత్రం 5 గంటల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
మాటామాటా..
దీనికి ముందు రాహుల్ గాంధీ తన ట్వీట్లో... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నియామకం కోసం ప్యానల్ రిగ్గింగ్తో ప్రారంభించి అవకతవకల సాక్ష్యాలను దాచిపెట్టడంతో ఐదంచెల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యూహాన్ని బీజేపీ మహరాష్ట్రలో అనుసరించిందని అన్నారు. వంచనకు పాల్పడిన వారు గెలవచ్చేమో కానీ ఇలాంటి పద్ధతుల వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడి, వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పోతుందని చెప్పారు. త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్కు బీజేపీ పాల్పడనుందన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ ఘాటుగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు అసంబద్ధమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఓ ప్రకటనలో ఆక్షేపించింది. ఎన్నికల కమిషన్ డిసెంబర్ 2024న ఇందుకు సంబంధించిన వాస్తవాలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు తెలియజేసిందని, దానిని ఈసీఐ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందని తెలిపింది. సాక్ష్యాలు లేకుండా పదేపదే ఎవరు ఆరోపణలు చేసినా వారికి చట్టం పట్ల గౌరవం లేదనే అభిప్రాయానికి తావిస్తుందని, నిష్పాక్షిక ఎన్నికల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఎన్నికల సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఘాటుగా విమర్శించింది. కాగా, ఈసీ సమాధానం ఇచ్చిన కొద్దిసేపటికే రాహుల్ తిరిగి స్పందించారు. ఈసీ ముందు రెండు డిమాండ్లు ఉంచారు. తమ డిమాండ్లను నెరవేర్చడం ద్వారా ఈసీ తన విశ్వసనీయతను నిరూపించుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ రిగ్గింగ్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం
బీజేపీపై మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలు.. రాహుల్ పోస్ట్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి