Share News

Suprem Court: మంత్రిని చాకిరేవు పెట్టి ఉతికారేసిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - May 19 , 2025 | 03:25 PM

మధ్యప్రదేశ్ బిజెపి మంత్రి కున్వర్ విజయ్ షా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఒక రకంగా చెప్పాలంటే, చాకిరేవుపెట్టి ఉతికారేసింది.

Suprem Court:  మంత్రిని చాకిరేవు పెట్టి ఉతికారేసిన సుప్రీంకోర్టు
BJP Minister - Col Sofiya Qureshi - Suprem Court

BJP Minister - Col Sofiya Qureshi - Suprem Court : మధ్యప్రదేశ్ బిజెపి మంత్రి కున్వర్ విజయ్ షా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఒక రకంగా చెప్పాలంటే, చాకిరేవుపెట్టి ఉతికారేసింది. కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన వ్యాఖ్యలకు బిజెపి మంత్రి చెప్పిన క్షమాపణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాదు, క్షమాపణ చెప్పడాన్ని కూడా సుప్రీంకోర్టు ఇవాళ (సోమవారం) ప్రశ్నించింది. అవి చట్టపరమైన చర్యల నుండి తప్పించుకుని బయటపడటానికి కార్చే 'మొసలి కన్నీళ్లు' కాదా అని అడిగింది.

మంత్రి ఇచ్చిన క్షమాపణ కోర్టుకు అవసరం లేదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది."మీరు చేసిన ఈ చెత్త వ్యాఖ్యలు, పూర్తిగా ఆలోచన లేకుండా... మాకు ఈ క్షమాపణ అవసరం లేదు" అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరమైన చర్యలను నివారించడానికి ఇది 'మొసలి కన్నీళ్లు' లాగా అనిపిస్తుందని కూడా అభిప్రాయపడింది.


అంతటితో ఆగని సుప్రీం కోర్టు.. ప్రజా ప్రతినిధిగా, ప్రతి పదాన్ని తెలివిగా ఉపయోగించాలని మంత్రికి సుప్రీం కోర్టు చెప్పింది. "మేము మీ వీడియోలను చూశాము; మీరు అసభ్యకరమైన భాషను ఉపయోగించే అంచున ఉన్నారు" అని విచారణ సందర్భంగా ఇవాళ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అంతేకాదు, ఈ ఎపిసోడ్‌ను దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని కోర్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)ని ఆదేశించిన బెంచ్, మే 20 మంగళవారం నాటికి SITని ఏర్పాటు చేయాలంది. ఈ టీంలో మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన ఒక మహిళా అధికారితో సహా ముగ్గురు సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులు కలిగి ఉండాలని ఆదేశించింది.


అక్కడితో ఆగని అత్యున్నత కోర్టు.. ముగ్గురు అధికారులు "రాష్ట్రం వెలుపల నుండి ఉండాలి".. కనీసం ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఉన్న అధికారి నేతృత్వంలో ఉండాలని కూడా కోర్టు నిర్దేశించింది. మిగిలిన ఇద్దరు సభ్యులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) హోదా కంటే తక్కువ ఉండకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది.

ఇలా ఉండగా, కల్నల్ ఖురేషిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీకి చెందిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా ప్రసంగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఈ కేసు సుప్రీం కోర్టు చెంతకు చేరింది. ఆపరేషన్ సిందూర్ సైనిక అంశాల గురించి మీడియాకు వివరించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో పాటు కల్నల్ ఖురేషి ఇద్దరు అధికారులలో ఒకరు.


ఇవి కూడా చదవండి

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Nandigam Suresh: నందిగం సురేష్‌కు ఎదురు దెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - May 19 , 2025 | 03:42 PM