Chennai High Court: కులం ఆధారంగా విరాళాల స్వీకరణ నిరాకరించడం అంటరానితనమే
ABN , Publish Date - May 13 , 2025 | 07:36 AM
మద్రాసు హైకోర్టు, ఆలయ ఉత్సవాల కోసం కులం ఆధారంగా విరాళాలను స్వీకరించడం నిరాకరించడం కూడా అంటరానితనం కింద వస్తుందని తెలిపింది. ఈ అంశంపై దేవాదాయశాఖకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.

మద్రాసు హైకోర్టు
చెన్నై, మే 12(ఆంధ్రజ్యోతి): ఆలయ ఉత్సవాల కోసం కులం ఆధారంగా విరాళాలు స్వీకరించేందుకు నిరాకరించడం కూడా అంటరానితనం కిందకే వస్తుందని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. దేశంలో అంటరానితనం వివిధ రకాలుగా, పలు రూపాల్లో ఆచరణలో ఉందని, ఇది కూడా అలాంటి వాటిల్లో ఒకటి అని వ్యాఖ్యానించింది. చెన్నై కుండ్రత్తూర్ తిరునాగేళ్వర్ ఆలయ బ్రహ్మోత్సవ వేడుకలకు నిర్దిష్ట వర్గాల నుంచే విరాళాలు వసూలు చేస్తున్నారని, ఇతర వర్గాల నుంచి నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ పాండ్యరాజన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భరత్ చక్రవర్తి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. దేవుడి ఉత్సవాల వ్యవహారంలోనూ కుల ప్రస్తావన రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఆలయ ఉత్సవాల కోసం అన్ని వర్గాలు విరాళాలు ఇవ్వడానికి అనుమతించాలని, దీనికి తగిన ఉత్తర్వులు జారీచేయాలని దేవాదాయశాఖను ఆదేశించారు.