Justice Yashwant Varma: జస్టిస్ వర్మ అభిశంసనపై ఏకాభిప్రాయానికి కృషి
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:51 AM
అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్వర్మపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే విషయమై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది...

అన్ని పార్టీలతో చర్చిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 3: అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్వర్మపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే విషయమై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతోంది. తీర్మానానికి మద్దతుగా ఎంపీల సంతకాలు తీసుకోవాలని భావిస్తోంది. జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు ఆయన అధికారిక నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో లక్షలాది రూపాయల నగదు కాలిపోయింది. లెక్కలో చూపని ఈ నగదుపై ఇంతవరకు పోలీసు కేసు నమోదు కాలేదు.
సుప్రీంకోర్టు నియమించిన అంతర్గత కమిటీ మాత్రం జస్టిస్ వర్మను తప్పుపట్టింది. భారీగా నగదు లభించినా జస్టిస్ వర్మపై చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు రావడంతో ఆయనను పదవి నుంచి తొలగించేందుకు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అభిశంసన తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షాలు సూత్రప్రాయంగా మద్దతు తెలిపాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు గురువారం చెప్పారు. న్యాయ వ్యవస్థలోని అవినీతికి సంబంధించిన విషయం కావడంతో అన్ని పార్టీల మద్దతు తీసుకుంటున్నట్టు తెలిపారు.