CBSE: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:23 AM
సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎ్సఈ) పదో తరగతి పరీక్షల విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను ఇకపై ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది.

న్యూఢిల్లీ, జూన్ 25: సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎ్సఈ) పదో తరగతి పరీక్షల విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను ఇకపై ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది. తొలి దశ పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఈ ఫేజ్లో పరీక్షలకు విద్యార్థులంతా తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇక రెండో దశ పరీక్షలను మే నెలలో నిర్వహిస్తారు.
వీటిని ఐచ్ఛికంగా పేర్కొన్నారు. విద్యార్థులు మొదటి దశలో సాధించిన మార్కులను మెరుగుపరచుకోవాలనుకుంటే రెండో ఫేజ్ పరీక్షలు రాసుకోవచ్చు. 2026నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకుగాను జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, మొదటి దశ పరీక్షల ఫలితాలు ఏప్రిల్లో, రెండో దశ ఫలితాలను జూన్లో విడుదల చేస్తామని సీబీఎ్సఈ పరీక్షల కంట్రోలర్ సన్యమ్ తెలిపారు.