Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:23 PM
పహల్గాం దాడి నేపథ్యంలో ఇవాళ కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు చేసింది. దేశ రక్షణకు సంబంధించి..

Cabinet Briefing: పహల్గాం దాడి నేపథ్యంలో ఇవాళ కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు చేసింది. దేశ రక్షణకు సంబంధించి ముఖ్యంగా దృష్టిపెట్టిన కేంద్ర మంత్రి వర్గం ఈ అంశంతో పాటు, దేశ వ్యాప్తంగా, వివిధ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
కుల గణనకు సంబంధించి ఇవాళ కేంద్ర మంత్రి వర్గం పెద్ద ప్రకటన చేసింది. జనాభా లెక్కల్లో భాగంగా కుల గణన కూడా చేస్తామని కేంద్రం పేర్కొంది. పారదర్శకంగా కులగణన జరగాలని కేంద్రం భావిస్తోంది. ఇందు కోసం సర్వేలపై ఆధారపడకుండా జనాభాలెక్కలలోనే ఈ విషయం నిర్ధారణ చేసుకుంటే సామాజిక సమతుల్యతకు ఆస్కారం లభిస్తుందని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్లు తీసుకొచ్చే సర్వేలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని, దీని వల్ల సమాజ శ్రేయస్సు దెబ్బతినే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
తదుపరి జనాభా లెక్కల్లో కుల సర్వేను కూడా చేర్చాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం చారిత్రకమని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇవాళ (బుధవారం) న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని వివరిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. "రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రాబోయే జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని నిర్ణయించింది" అన్నారు.
కుల గణనను రాజకీయం చేసినందుకు ఆయన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలో నిర్వహించిన సర్వేలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమన్న ఆయన.. "కాంగ్రెస్ దాని INDI కూటమి భాగస్వాములు కుల గణనను రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నాయని అందరికీ తెలుసు. కొన్ని రాష్ట్రాలు కులాలను లెక్కించడానికి సర్వేలు నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు దీన్ని బాగా చేశాయి, మరికొన్ని రాష్ట్రాలు పారదర్శకంగా లేని విధంగా రాజకీయ కోణం నుండి మాత్రమే ఇటువంటి సర్వేలను నిర్వహించాయి. ఇటువంటి సర్వేలు సమాజంలో సందేహాలను సృష్టించాయి. మన సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల చెదిరిపోకుండా చూసుకోవడానికి, సర్వేలకు బదులుగా కుల గణనను జనాభా గణనలో చేర్చాలి" అని మంత్రి అన్నారు.
కులాల జనాభా లెక్కించి ఆ సంఖ్య ఆధారంగా సంక్షేమ పథకాలు అందించాలని విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కొంత కాలంగా కోరుతున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కుల గణనకు సంబంధించిన అంశంతోపాటు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు చేసింది. సిల్చార్- షిల్లాంగ్ హైస్పీడ్ కారిడార్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసోం- మేఘాలయా మధ్య కొత్త హైవేకు అనుమతిచ్చింది కేంద్ర క్యాబినెట్. చెరకు రైతులకు కనీస మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రివర్గం.