Operation Sindoor: పాక్ ఆర్మీ పోస్టులపై విరుచుకుపడిన భారత బలగాలు.. బీఎస్ఎఫ్ కొత్త వీడియో రిలీజ్
ABN , Publish Date - May 27 , 2025 | 04:56 PM
భారత సాయుధ బలగాలు పాకిస్థాన్లోని 2.2 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరపడం, అత్యంత శక్తివంతంగా దాడులు జరగడంతో పాకిస్థాన్ రేంజర్లు కకావికలై పరుగులు తీయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

జమ్మూ: 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)లో భాగంగా పాకిస్థాన్ భూభాగంలోకి భారత బలగాలు చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై ఏవిధంగా విరుచుకుపడ్డాయో వివరించే కొత్త వీడియోను సరిహద్దు భద్రతా దళం (BSF) విడుదల చేసింది. మంగళవారంనాడిక్కడ జమ్మూ బీఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వీడియోను అధికారులు విడుదల చేశారు.
సాయుధ బలగాలు పాకిస్థాన్లోని 2.2 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడటం, అత్యంత శక్తివంతంగా ఈ దాడులు జరగడంతో పాకిస్థాన్ రేంజర్లు కకావికలై పరుగులు తీయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడంతో పాటు సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ ఆర్మీ పోస్టులను విధ్వంసం చేయడం కూడా వీడియోలో ఉంది.
పక్కా ప్లాన్తోనే..
పాకిస్థాన్ క్రాస్-బోర్డర్ షెల్లింగ్ను సమర్ధవంతంగా తాము తిప్పికొట్టినట్టు బీఎస్ఎస్ అధికారులు తెలిపారు. మే 9,10 తేదీల్లో కూడా ఎల్ఓసీ వెంబడి ఉగ్రస్థావరాలపై దాడులకు ప్లాన్ చేశామని జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్ఎఫ్ ఐజీ శశాంక్ ఆనంద్ తెలిపారు. పాకిస్థాన్ క్రాస్ బోర్డర్ ఫైరింగ్ జరపడంతో ముందుగానే సన్నద్ధంగా ఉన్న తమ బలగాలు అనేక పాక్ పోస్టులపై విరుచుకుపడి భారీగా నష్టపరిచాయని, ఈ దాడుల్లో తమకెలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ఆపరేషన్లో భాగంగా ఎల్ఓసీ సమీపంలోని లూనిలో లష్కరే తొయిబా ఉగ్రవాద శిబిరంపై మే 9-10వ తేదీల మధ్య రాత్రి పక్కా ప్లాన్తో దాడిచేశామని, ఈ ఉగ్రవాద శిబరం అంతర్జాతీయ సరిహద్దు నుంచి పాకిస్థాన్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది టూరిస్టులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్చిచంపడంతో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇందుకు ప్రతిగా భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న పాక్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు జరిపాయి. జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. దీంతో ఎల్ఓసీ వెంబడి పాక్ కాల్పులకు తెగబడింది. కౌంటర్ ఆపరేషన్గా భారత్ పెద్దఎత్తున విరుచుకుపడి రాడార్ సిస్టమ్లు, కమ్యూనికేషన్ హబ్లు, 11 పాక్ ఎయిర్బేస్లకు చెందిన ఎయిర్ఫీల్డ్లను ధ్వంసం చేసింది. దీంతో బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణ ప్రతిపాదనతో ముందుకు రావడంతో భారత్ అందుకు అంగీకారం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఆ ఉగ్రవాద ముల్లును తొలగించాల్సిన సమయం వచ్చింది..
ఇంకోసారి మా జోలికొస్తే అంతకంత అనుభవిస్తారు.. పాక్కు శశి థరూర్ స్ట్రాంగ్ వార్నింగ్..
Read Latest National News and Telugu News