Professor Ali Khan: అశోక వర్శిటీ ప్రొ. అలీఖాన్కు బెయిల్.. సిట్కు సుప్రీం అనుమతి
ABN , Publish Date - May 21 , 2025 | 02:12 PM
ప్రొఫెసర్ అలీ ఖాన్కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సిట్ ఏర్పాటుకు హర్యానా డీజీపీకి అనుమతిచ్చింది. ఈ కేసు దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటుకు ఆదేశించింది.

ఇంటర్నెట్ డెస్క్: అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్కు తాత్కాలిక మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇవాళ తాజాగా వాదనలు వింది. బెయిల్తో పాటు, దీనిపై సిట్ ఏర్పాటుకు హర్యానా డీజీపీకి అనుమతి మంజూరు చేసింది. ప్రొఫెసర్ అలీ ఖాన్ కేసును దర్యాప్తు చేయాలని ముగ్గురు సభ్యుల సిట్ను అత్యన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఈ కేసును దర్యాప్తు చేయడానికి హర్యానాలో నివసించని ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) 24 గంటల్లో ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందులో ఒక మహిళా IPS అధికారి కూడా ఉండాలని పేర్కొంది. ఇంకా DGP-ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఈ దర్యాప్తు సాగాలని చెప్పింది. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ కేసులో కొనసాగుతున్న దర్యాప్తును సులభతరం చేయడానికి మాత్రమే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.
అశోక విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ విభాగాధిపతిగా ఉన్న మహ్మదాబాద్ తనపై నమోదైన రెండు FIRలకు ఒకే బెయిల్ బాండ్ను అందించాలని, తన పాస్పోర్ట్ను సోనిపట్లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు సమర్పించాలని కూడా ఆదేశించింది. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు విద్యా రంగం సహా ఇతరులు "బాధ్యతా రహిత ప్రకటనలు" చేయవద్దని హెచ్చరించింది. అయితే ఆ విషయంపై అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు.
మహ్మదాబాద్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, సదరు సోషల్ మీడియా పోస్ట్ వెనుక ఎటువంటి నేరపూరిత ఉద్దేశ్యం లేదని వాదించారు. ఇలా ఉండగా, హర్యానా పోలీసులు మే 18న ఢిల్లీలో మహ్మదాబాద్ను అరెస్టు చేసి, అతని విదేశీ ప్రయాణాలను విచారించడానికి కస్టడీని కోరారు. అయితే, సోనెపట్ మెజిస్ట్రేట్ పోలీసు కస్టడీ అభ్యర్థనను తిరస్కరించి, మే 27 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ సందర్భంలో అలీ ఖాన్ అంతర్జాతీయ ప్రయాణం అనుమానాస్పదమైనది కాదని, విద్యాపరమైన స్వభావం కలిగి ఉందని మహముదాబాద్ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఇవాళ అత్యున్నత న్యాయస్థానం తాజా తీర్పుని ప్రకటించింది.
ఇలా ఉండగా, అలీ ఖాన్ తన ఫేస్బుక్ పోస్ట్లో ఆపరేషన్ సిందూర్కు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లను ఆయన తక్కువ చేసి మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హర్యానాలోని స్థానిక బిజెపి యువ నాయకుడు రెండవ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కాగా, ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ సోషల్ మీడియాలో ఆపరేషన్ సిందూర్కు సంబంధించి విమర్శలు గుప్పించారు. సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశాలను అసోసియేట్ ప్రొఫెసర్ "ఆప్టిక్స్" గా అభివర్ణించారు. అంతేకాకుండా వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైనిక చర్య అయిన 'ఆపరేషన్ సిందూర్'పై వ్యాఖ్యానించిన ఫేస్బుక్ పోస్ట్కు సంబంధించి హర్యానా పోలీసులు అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, అలీ ఖాన్ మహ్మదాబాద్ సోనిపట్ (అశోక విశ్వవిద్యాలయం)లో అసోసియేట్ ప్రొఫెసర్, ఇంకా పొలిటికల్ సైన్స్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. కాగా, మహముదాబాద్ అరెస్టును విద్యావేత్తలు, పౌర సమాజం ఖండించింది. దీనిని స్వేచ్ఛా వాక్ స్వాతంత్ర్యం, విద్యా స్వేచ్ఛపై దాడి అంటూ వాళ్లు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి