Amarnath Yatra: వర్ష బీభత్సం.. మహిళ మృతి.. అమర్నాథ్ యాత్ర రద్దు..
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:38 AM
Amarnath Yatra: యాత్ర సాగుతున్న దారిలో మహిళ ప్రమాదానికి గురైన సంఘటన తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వర్షం కారణంగా పెద్ద మొత్తంలో బురద మట్టి కిందకు జారుతోంది.

అమర్నాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వర్ష బీభత్సానికి ఓ నిండు ప్రాణం బలైంది. కొండచరియలు విరిగిన ఘటనలో ఓ భక్తురాలు ప్రాణాలు పోగొట్టుకుంది. భారీ వర్షాల కారణంగా గందర్ బాల్ జిల్లా, బల్తల్ ఏరియాలోని అమర్నాథ్ యాత్రకు వెళ్లే దార్ల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కొండచరియలు విరిగి బురదమట్టితో కలిసి కిందకు జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం బల్తల్ దారిలో కొండపైకి వెళుతున్న కొంతమంది భక్తులు బురదలో కొట్టుకుపోయారు. ఓ మహిళ చనిపోయింది.
మరికొంతమంది గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. కొండపై చిక్కుకుపోయిన వారిని అక్కడి నుంచి సురక్షితమైన ప్రదేశానికి తరలించాయి. ఇక, భారీ వర్షం కారణంగా అమర్నాథ్ యాత్ర సైతం రద్దయింది. యాత్ర పున:ప్రారంభంపై ఎలాంటి క్లారిటీ లేదు. వర్షం కారణంగా యాత్ర సాగే రెండు దారులు బాగా పాడయ్యాయి. దీంతో ది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది. యాత్ర సాగే రెండు దార్లను బాగుచేస్తోంది.
జనం చూస్తుండగానే విషాదం..
యాత్ర సాగుతున్న దారిలో మహిళ ప్రమాదానికి గురైన సంఘటన తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వర్షం కారణంగా పెద్ద మొత్తంలో బురద మట్టి కిందకు జారుతోంది. దీంతో భక్తులు మొత్తం కొండ చివర్లలో ఉన్న రెయిలింగ్స్ పట్టుకుని నిలబడి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇద్దరు జారిపోయి బురదలో పడ్డారు. కిందకు అలాగే కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన ఇద్దరిలో మహిళ చనిపోగా.. పురుషుడ్ని రెస్క్యూ టీమ్ రక్షించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ప్రజలకు ముఖ్యమంత్రి బంపర్ ఆఫర్.. ఆగస్టు నుంచి ఉచిత కరెంట్
ఆర్సీబీ తొక్కిసలాట.. ప్రభుత్వ రిపోర్టులో సంచలన విషయాలు