సంతకాలు అవుతాయి.. ఆయుధాలు రావు
ABN , Publish Date - May 30 , 2025 | 06:25 AM
ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిలో మన దేశ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ విమర్శించారు. ఆయుధాల సరఫరా కోసం కాంట్రాక్టుల మీద సంతకాలైతే చేస్తున్నారు కానీ, సరఫరా మాత్రం జరగదని వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తికాలేదు
2024 మార్చిలో అందాల్సిన తేజస్ విమానాలు ఒక్కటీ రాలేదు
దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి
సీఐఐ వార్షిక సదస్సులో వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 29: ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిలో మన దేశ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ విమర్శించారు. ఆయుధాల సరఫరా కోసం కాంట్రాక్టుల మీద సంతకాలైతే చేస్తున్నారు కానీ, సరఫరా మాత్రం జరగదని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా అనుకున్న సమయంలో పూర్తికాలేదని, సమయానికి ఇవ్వలేనప్పుడు ఎందుకు వాగ్దానాలు చేయాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘నేను ఒక్కసారి కమిటైతే.. నా మాట నేనే వినను’ అనే సినిమా డైలాగ్ను గుర్తు చేశారు. దేనికైనా కట్టుబడితే గడువులోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. దేశీయంగా రక్షణ వ్యవస్థల ఉత్పత్తిని పెంచడానికి, మేకిన్ ఇండి యా కోసం వాయుసేన కృషి చేస్తోందని చెప్పారు. సీఐఐ వార్షిక సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ సమక్షంలోనే అమర్ప్రీత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘‘రక్షణ పరికరాలు, ఆయుధాల సరఫరాలో నిర్ధారిత గడువు అన్నదే లేకుండా పోయింది. 83 తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాల సరఫరా కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో 2021 ఫిబ్రవరిలో రూ.48 వేల కోట్ల కాంట్రాక్టు కుదిరింది. 2024 మార్చి నుంచే విమానాల డెలివరీ మొదలుకావాలి. కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా అందజేయలేదు. గతంలో తేజస్ ఎంకే1 విమానాల సరఫరాలోనూ జాప్యం జరిగింది. తే జస్ ఎంకే2 ప్రొటోటైప్ అందాల్సి ఉంది. ఆమ్కా ఫైటర్కు సంబంధించి ప్రొటోటైప్ కూడా సిద్ధంకాలేదు. మన దేశంలో ఉత్పత్తి చేయడం కాదు, మన దేశంలోనే రూపొందించడం, అభివృద్ధి చేయడం (డిజైన్ అండ్ డెవల్పమెంట్)పై దృష్టిపెట్టాలి. సైనిక దళాలకు, పరిశ్రమకు మధ్య విశ్వాసం నెలకొనాలి. దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి. ప్రాణం పోయినా పర్లేదు, మాట పోవద్దనే సూక్తిని గుర్తుంచుకోవాలి’’ అని అమర్ప్రీత్సింగ్ పేర్కొన్నారు.