Himachal Monsoon Havoc: వర్ష బీభత్సం.. 63 మంది మృతి.. డజన్ల మంది గల్లంతు..
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:21 PM
Himachal Monsoon Havoc: రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికిపైగా గాయపడ్డారు. వందల సంఖ్యలో ఇల్లులు నేలమట్టం అయ్యాయి. 14 బ్రిడ్జీలు వరదలో కొట్టుకుపోయాయి. 300 జంతువులు చనిపోయాయి. 500 రోడ్లు మూసివేయబడ్డాయి.

హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ 63 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ మంది గల్లంతయ్యారు. దాదాపు రూ.400 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 20వ తేదీన రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఏడాదీ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడడం లాంటి ఘటనల్లో.. ఒక్క మండి జిల్లాలోనే ఏకంగా 17మంది చనిపోయారు. కంగారా జిల్లాలో 13మంది, చంబ జిల్లాలో ఆరుగురు, షిమ్లా జిల్లాలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మండిలోని తునగ్, బగ్సయేద్ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. తాజా సమాచారం ప్రకారం ఒక్క మండి జిల్లాలోనే 40 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. బిలాస్పూర్, హమీర్పూర్, కిన్నౌర్, కులు, లాహౌల్ స్పిరిట్, సిర్మౌర్, సోలన్, ఉన్నా జిల్లాల్లోనూ మరణాలు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 100మందికిపైగా గాయపడ్డారు. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. 14 బ్రిడ్జీలు వరదలో కొట్టుకుపోయాయి. 300 జంతువులు చనిపోయాయి. 500 రోడ్లు మూసివేయబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 500లకు పైగా ట్రాన్స్ఫార్మర్లు పని చేయకుండా పోయాయి. దీంతో కరెంట్ లేక వేల మంది అంధకారంలో బతుకుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జులై 7వ తేదీ వరకు రెయిన్ అలర్ట్ కొనసాగుతోంది.
ప్రస్తుతం వరదలు, కొండచరియలు విరిగిపడిన సంఘటనల తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొన్ని వీడియోల్లో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఓ వీడియోలో కొండచరియలు విరిగి మట్టి దిబ్బలు ఇంటిని సగానికిపైగా కప్పేశాయి. మరో వీడియోలో రోడ్డుపై కొండచరియలు విరిగిపడడంతో కారులో ఉన్న వారు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
ఇవి కూడా చదవండి
నెల రోజులు చక్కెర తినకుండా ఉంటే శరీరంలో అద్భుతమైన మార్పులు.!
పేక మేడలా కూలిన భవంతి.. 7 సెకన్లలో అంతా అస్సాం..