Share News

2025 India Incidents: అహ్మదాబాద్ టూ ప‌హ‌ల్గామ్ ఎటాక్ .. 6 నెలల్లో అనేక విషాదాలు..

ABN , Publish Date - Jun 14 , 2025 | 08:54 AM

భారతదేశం ఇటీవల అనేక సవాళ్లను ఎదుర్కొంది. అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాదం నుండి కుంభమేళ వరకు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

2025 India Incidents: అహ్మదాబాద్ టూ ప‌హ‌ల్గామ్ ఎటాక్ .. 6 నెలల్లో అనేక విషాదాలు..
2025 India Incidents

2025 India Major Incidents: 2025 సంవత్సరం సగం కూడా పూర్తికాకముందే భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది. తాజాగా చోటు చేసుకున్న అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు గత 6 నెలల్లో అనేక ప్రమాదాలు దేశాన్ని కుదిపేశాయి. ఈ ప్రమాదాలు మనం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, భద్రతా లోపాలు, సహాయక చర్యల లోపాలపై ఆలోచించేలా చేస్తున్నాయి. భారతదేశంలో గత ఆరు నెలల్లో జరిగిన విషాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఎయిర్ ఇండియా ప్రమాదం..

అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపింది. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కేవలం కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో కేవలం ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడగా మిగతా 241 మంది దుర్మరణం పాలయ్యారు. భారీ ప్రమాదం కావడంతో ప్రయాణికుల మృతదేహాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. అంతేకాకుండా, ఈ విమానం మెడికల్‌ కాలేజీ హాస్టల్లోకి దూసుకెళ్లడంతో 33 మంది మెడికోలు కూడా దుర్మరణం చెందారు. మొత్తానికి ఈ ఘోర ప్రమాదంలో 274 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా కొంత మంది ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Plane Crash.jpg


చిన్నస్వామి స్టేడియంలో తొక్కిస‌లాట

బెంగళూరులో జూన్ 4న తలపెట్టిన ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లోనూ ఘోర విషాదం చోటుచేసుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 ఏళ్ల తర్వాత తొలిసారి IPL కప్‌ గెలుచుకోవడంతో పరిమితికి మించి వేలాదిగా క్రికెట్‌ అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు తరలి వచ్చారు. ఈ క్రమంలో అక్కడ భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాతపడ్డారు. అంతేకాకుండా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై విచారించిన అధికారులు.. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన పలువురిని సస్పెండ్ చేశారు.

Cricket.jpg


ప‌హ‌ల్గామ్ ఎటాక్..

ప‌హ‌ల్గామ్ ఎటాక్.. ఈ ఏడాది జ‌రిగిన అతి పెద్ద విషాద ఘ‌ట‌నల్లో ఇది కూడా ఒకటి. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిలో 27 మంది అమాయక పౌరులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందుకు ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న పాక్‌, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. 11 పాక్ ఎయిర్‌బేస్‌లకు చెందిన ఎయిర్‌ఫీల్డ్‌లను కూడా మన బలగాలు ధ్వంసం చేశాయి. దీంతో బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణ ప్రతిపాదనతో ముందుకు రావడంతో భారత్ అందుకు అంగీకరించింది.

Pehalgam.jpg


మహా కుంభమేళా తొక్కిసలాట

ఈ ఏడాది జనవరి 29న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమస్థలి వద్ద బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. అయితే, అక్కడ తొక్కిసలాట జరిగి 40 మంది మృతి చెందారు. అంతేకాకుండా మరో 60 మందికి పైగా గాయాలపాలయ్యారు.

kumbamela.jpg


Also Read:

15 ఏళ్ల తర్వాత కలిశారు.. విమానం విషాదం మిగిల్చింది..

వీడని మిస్టరీ!

For More National News

Updated Date - Jun 14 , 2025 | 03:00 PM