Share News

Success Story: ఒకే ఒక్కడు.. 78 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు..

ABN , Publish Date - May 06 , 2025 | 11:41 AM

Success Story: ఈ విషయం జిల్లా మెజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి స్పందించారు. ఆదివారం రామ్‌తో పాటు అతడి తల్లిదండ్రులకు కూడా సన్మానం చేశాడు. పై చదువులకు కావాల్సిన సాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇప్పుడు జాతీయ మీడియాలో సైతం రామ్ పేరు మారుమోగుతోంది.

Success Story: ఒకే ఒక్కడు.. 78 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు..
Success Story

మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరోబ్రహ్మ

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు


సీనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా ‘ అడవి రాముడు’లో ఈ పాట ఉంటుంది. వేటూరి సుందర రామ్మూర్తి రాసిన ఈ పాట అక్షర సత్యం. ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించాలంటే కష్టపడాల్సిందే. చెమట చిందాకుండా చరిత్ర రాయటమో.. తిరగరాటమో జరగదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాడు ఓ 15 ఏళ్ల బాలుడు. ఆ బాలుడు 78 ఏళ్ల చరిత్రను మార్చేశాడు. కొత్త శకానికి నాంది పలికాడు. పేదరికాన్ని జయించి.. కష్టాన్ని నమ్ముకుని పదవ తరగతి పరీక్షలు రాసి పాసయ్యాడు. ‘అయ్యా.. ఇందులో ఏముంది అంత గొప్ప’ అనుకోకండి.


మనకు ఎంతో సింపుల్‌గా అనిపిస్తున్న ఈ విషయం ఆ ప్రాంతం వారికి ఎంతో కష్టమైన పని. ఎంత కష్టం అంటే.. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతం వారిలో టెన్త్ పాసైన వారు ఒక్కరూ లేరు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, బరబంకి జిల్లా నిజామ్‌పూర్ గ్రామానికి చెందిన రామ్ కేవల్‌ది అత్యంత నిరుపేద కుటుంబం. ఇతడిదొక్కడిదే కాదు.. ఊరిలోని వారందరూ దాదాపు నిరుపేదలే. 300 మంది ఉండే ఆ గ్రామంలో చాలా మంది దళిత కులానికి చెందిన వారే.


స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో పదవ తరగతి పాస్ అయినవారు లేరు. రామ్ కేవల్‌కు చదువంటే ఎంతో ఇష్టం. అందుకే పేదరికంతో పోరాడి మరీ తనకు ఇష్టమైన చదువును కొనసాగిస్తూ వచ్చాడు. పెళ్లిళ్లలో లైట్లు మోయడానికి వెళ్లేవాడు. అలా చేస్తే 200 నుంచి 300 రూపాయలు వచ్చేవి. రాత్రి ఇంటికి తిరిగి రాగానే సోలార్ లైటు కింద రెండు గంటలు చదివేవాడు. గ్రామంలోని కొంతమంది రామ్‌ను ఎగతాళి చేసేవారు. ‘పది పాస్ కావటం నీ వల్ల కాదు’ అని అనేవారు. అయినా రామ్ పట్టించుకోలేదు. చదువు మీద దృష్టిపెట్టాడు.


గ్రామస్తుల అంచనాలను తలకిందులు చేస్తూ.. 78 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ రామ్ పదవ తరగతి పాస్ అయ్యాడు. ఈ విషయంపై జిల్లా మెజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం రామ్‌తో పాటు అతడి తల్లిదండ్రులకు కూడా సన్మానం చేశాడు. పై చదువులకు కావాల్సిన సాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. పై చదువుల గురించి రామ్ మాట్లాడుతూ.. ‘ నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. అయితే, నేను పదవ తరగతి పాస్ అయ్యానన్న సంగతి ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇది నిజం అని నమ్మడానికి కొంత టైం పడుతుంది’ అని అన్నాడు.


ఇవి కూడా చదవండి

Pakistan: పాకిస్తాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. ఫలితం లేకుండా పోయిన UNSC మీటింగ్

Sai Rajesh: బాబిల్ ఖాన్ గొడవ.. మండిపడ్డ సాయి రాజేష్

Updated Date - May 06 , 2025 | 03:42 PM