Local Train: ఘోర ప్రమాదం.. రైలు నుంచి పడి ఐదుగురు మృతి
ABN , Publish Date - Jun 09 , 2025 | 10:25 AM
Mumbai Local Train: ముంబైలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి కింద పడి ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ముంబై: నగరంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి కింద పడి ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం ఓ లోకల్ ట్రైన్ ముంబై ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్’ నుంచి థానేలోని కసరా ఏరియాకు బయలు దేరింది. ప్రయాణికులతో ఆ రైలు కిక్కిరిసిపోయింది. బస్సు డోరు దగ్గర వేలాడినట్లు.. కొంతమంది ప్రయాణికులు రైలు డోరు దగ్గర వేలాడుతూ ప్రయాణం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల అధిక రద్దీ కారణంగా తోపులాట జరిగింది.
డోరు దగ్గర ఉన్న 10 నుంచి 12 మంది ప్రయాణికులు కింద పడిపోయారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రమాదం జరగడానికి గల అసలు కారణం ఏంటో తెలియరాలేదు. తోపులాట కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
హనీమూన్లో జంట మిస్సింగ్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..
మస్క్ను కలవరపెడుతున్న మరో సమస్య.. మస్క్కు సూర్యుడి దెబ్బ..