Guru Purnima 2025: గురు పౌర్ణమి.. ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?
ABN , Publish Date - Jul 10 , 2025 | 09:54 AM
ఈరోజు గురు పౌర్ణమి. అసలు గురు పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటి? ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? ఈ రోజున ఏం పనులు చేయకూడదు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: గురు పౌర్ణమి.. అంటే జ్ఞానాన్ని ప్రసాదించే గురువులకు కృతజ్ఞతగా జరుపుకునే పవిత్ర పండుగ. భారతీయ సనాతన ధర్మంలో తల్లి, తండ్రి తర్వాత అత్యంత గౌరవనీయ స్థానం గురువుకే దక్కుతుంది. తల్లిదండ్రుల వద్ద మనం కొన్ని విషయాలే నేర్చుకుంటాం.. కానీ, గురువుల వద్ద నుంచి అనేక విషయాలను నేర్చుకుంటాం. అందుకే గురువును.. ‘గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః’ అని కొనియాడుతారు.
గురువు అర్థం ఏమిటి?
సంస్కృత భాషలో 'గు' అంటే చీకటి (అజ్ఞానం), 'రు' అంటే వెలుగు, తేజస్సు (జ్ఞానం). ఈ రెండు పదాల కలయికగా గురు అనే పదం ఏర్పడింది. అంటే.. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తారు కాబట్టి వారిని గురువు అని అంటాం.
గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు?
పురాణాల ప్రకారం మహర్షి వేదవ్యాసుడు గురుపౌర్ణమి రోజునే జన్మించారు. ఆయన వేదాలను విభజించి వాటిని ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు గౌరవంగా ఈ పండుగను జరుపుకుంటాం. అందుకే ఈ పండుగను 'వ్యాస పౌర్ణమి' అని కూడా పిలుస్తారు.
గురు పౌర్ణమి రోజున చాలా మంది భక్తులు సాయి బాబాను పూజిస్తారు. ఎందుకంటే ఆయనను సద్గురువుగా, ఆధ్యాత్మిక గురువుగా కొలుస్తారు. సాయిబాబాను పూజిస్తే తమ గురువులను గౌరవించి, వారి ఆశీస్సులు పొందినట్లే అవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజున సాయిబాబా బోధనలను అనుసరించడం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలని భక్తులు కోరుకుంటారు.
ఈ రోజు ఏం చేయాలి?
మీ జీవితంలో మార్గనిర్దేశం చేసిన ప్రతి గురువునూ స్మరించుకుని వారికి కృతజ్ఞతలు తెలపాలి.
గురువుల పాదాలకు నమస్కరించి, వారి ఆశీస్సులు తీసుకోవాలి.
గురు మంత్రాలను పఠించడం ద్వారా గురువుల అనుగ్రహాన్ని పొందవచ్చు.
గురువులకు నచ్చిన కానుకలను సమర్పించి, వారిని సత్కరించాలి.
గురువులు రచించిన పుస్తకాలు లేదా ఆధ్యాత్మిక గ్రంథాలను చదవాలి.
ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
ఉపవాసం ఉండి, సాత్వికాహారం తీసుకోవాలి.
ఏం చేయకూడదు?
గురు పౌర్ణమి రోజున జుట్టు, గోళ్లను కత్తిరించకూడదు.
నల్లని లేదా చిరిగిన బట్టలు ధరించకూడదు.
మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైనవి తినకూడదు.
గొడవ పడటం, అబద్ధం చెప్పడం లేదా హాని చేయడం వంటి పనులు చేయకూడదు.
ఈ పనులు చేయడం వల్ల మీ జీవితంలో ప్రతికూలత పెరుగుతుంది. అలాగే, మీరు లక్ష్మీదేవి ఆగ్రహానిక గురయ్యే అవకాశం ఉందని వేద పండితులు చెబుతున్నారు.
Also Read:
భరణం హక్కు.. వరకట్నం నేరం.. ఎందుకిలా? అసలు కారణం ఇదే!
సోమవారం నుంచి ఆదివారం వరకూ.. రోజు ఇలా స్నానం చేస్తే అదృష్టం వెంటాడుతుంది..!
For More Lifestyle News