Sheikh Hasina: షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్ష
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:17 PM
బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి, ఆందోళనలు పతాక స్థాయికి చేరుకోవడంతో 2024 ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఢాకాలోని అధికార నివాసాన్ని ఖాళీ చేసి దేశం విడిచిపెట్టారు. అనంతరం క్రమంలో ఆమె న్యూఢిల్లీ చేరుకున్నారు.

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు కోర్టు ధిక్కరణ కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) 6 నెలల జైలుశిక్ష విధించింది. ఐసీటీ చైర్మన్ జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మొజుందార్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించినట్టు 'ఢాకా ట్రిబ్యూన్' తెలిపింది. సుమారు ఏడాది క్రితం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా పదవీచ్యుతురాలయ్యారు. వెంటనే దేశం వదిలిపెట్టి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.
ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు గత జూన్లో అరెస్టు వారెంట్ చేసింది. బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వం సైతం షేక్ హసీనాను రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో షేక్ హసీనాకు కోర్టు ధిక్కరణ కింద ఐసిటీ 6 నెలల జైలు శిక్ష విధించింది. బంగ్లా నుంచి పారిపోయిన 11 నెల తర్వాత హసీనాకు ఒక కేసులో జైలుశిక్ష పడటం ఇదే మొదటిసారి. కాగా, ఇదే కేసులో హసీనాతో పాటు గోవిందగంజ్కు చెందిన రాజకీయ నేత షకీల్ అకాండ్ బుల్బుల్కు కూడా ట్రిబ్యునల్ రెండు నెలల జైలుశిక్ష విధించింది.
బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి, ఆందోళనలు పతాక స్థాయికి చేరుకోవడంతో 2024 ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఢాకాలోని అధికార నివాసాన్ని ఖాళీ చేసి దేశం వదిలిపెట్టారు. అనంతరం క్రమంలో ఆమె న్యూఢిల్లీ చేరుకున్నారు. సురక్షిత ప్రాంతంలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. స్వదేశంలో రిజర్వేషన్ ఆందోళనలు చెలరేగడం, ఆ తర్వాత జరిగిన అల్లర్లలో 1,400 మంది ప్రాణాలు కోల్పోయారని షేక్ హసీనాపై నేరాభియోగాలు నమోదయ్యాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను షేక్ హసీనా తోసిపుచ్చారు.
ఇవి కూడా చదవండి..
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ దేశాలు
ట్రంప్ ‘బ్యూటీఫుల్ బిల్లు’కు సెనెట్ ఆమోదం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి