Pakistan: పుతిన్ సాయం కోరిన పాక్.. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడండని విజ్ఞప్తి
ABN , Publish Date - Jun 05 , 2025 | 08:29 PM
భారత్తో ఉద్రిక్తతల పరిష్కారానికి పాక్ రష్యా సాయాన్ని అర్థించింది. ఈ మేరకు పాక్ ప్రధాని రాసిన లేఖను ఆయన స్పెషల్ అసిస్టెంట్ రష్యా విదేశాంగ శాఖ మంత్రికి అందించారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత్పై ఓవైపు ఉగ్రవాదాన్ని ఎగదొస్తున్న పాక్ మరోవైపు, వివాదానికి పరిష్కరించేందుకు సాయపడాలంటూ వివిధ దేశాలను అభ్యర్థిస్తోంది. తాజాగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహాయాన్ని కోరారు.
ఈ విషయమై పాక్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ సయ్యద్ తారీఖ ఫతేమీ స్పందించారు. పాక్ ప్రధాని రాసిన లేఖను రష్యా విదేశాంగ మంత్రి ద్వారా పుతిన్కు అందజేసినట్టు తెలిపారు. భారత్ను చర్చలవైపు ప్రోత్సహించేలా పుతిన్ తన ఇన్ఫ్లుయెన్స్ను వినియోగించాలని అభ్యర్థించినట్టు చెప్పారు. ఐక్యరాజ్యసమితితో పాటు భారత్ సహా ఏ దేశంతో అయినా ఈ విషయంలో కలిసి పనిచేసేందుకు పాక్ సిద్ధమని చెప్పారు.
‘ఇరుగు పొరుగు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం మొదలవ్వొచ్చనేలా పరిస్థితులు ఉండకూడదు. ఈ విషయమై అమెరికా సహా ఈయూ, రష్యాలకు మా అభిప్రాయాన్ని చెప్పాము. భారత్, పాక్ విషయంలో ఏ ప్రతిపాదనపై చర్చించేందుకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వారితో కలిసి చర్చలు ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాము’ అని ఆయన తెలిపారు. ఈ విషయంలో రష్యా చొరవ చూపాలని కూడా ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
పాక్ ఈ విషయంలో ఇప్పటికే అమెరికా సాయం కూడా అర్థించింది. ఉద్రిక్తతలు సర్దుమణిగేలా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఇక అమెరికాలో దౌత్యపరమైన పర్యటనలో ఉన్న పాక్ ప్రతిపక్ష నేత బిలావల్ భుట్టో కూడా అమెరికా అధ్యక్షుడిపై ప్రశంసలు కురిపించారు.
‘పాక్, భారత్ కాల్పుల విరమణకు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు ఇప్పటికి దాదాపు 10 సార్లు చెప్పి ఉంటారు. ఇది నిజమే. ఈ క్రెడిట్ ఆయనదే. కాల్పుల విరమణ ఒప్పందం వెనక కీలక పాత్ర పోషించిన అమెరికా, ఈ అంశంలో విస్తృత చర్చల ప్రారంభానికి కూడా సహకరించాలి’ అని బిలావల్ భుట్టో అన్నారు. ఏప్రిల్ 22న పహల్గాం దాడి తరువాత భారత్, పాక్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణానికి దారి తీసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా
ఖలిస్థానీ వేర్పాటు వాద పార్టీలతో సంబంధాలు తెంచుకోవాలి: కెనడా మాజీ ప్రధాని
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి