US Army Day: అమెరికా ఆర్మీ డేకు అతిథిగా పాక్ ఫీల్డ్ మార్షల్
ABN , Publish Date - Jun 13 , 2025 | 04:49 AM
వాషింగ్టన్లో శనివారం జరగనున్న 250వ ఆమెరికా ఆర్మీ డే ఉత్సవాలకు పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కు ఆహ్వానం అందడం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

న్యూఢిల్లీ, జూన్ 12: వాషింగ్టన్లో శనివారం జరగనున్న 250వ ఆమెరికా ఆర్మీ డే ఉత్సవాలకు పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కు ఆహ్వానం అందడం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మదినం కూడా. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక మునీర్ పాత్ర ఉందన్న ఆరోపణలు రావడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్కు వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో భారత బృందాలు ప్రపంచవ్యాప్తంగా వివరించి తిరిగి వచ్చిన నేపథ్యంలో అమెరికా చర్య ప్రాధాన్యం సంతరించుకొంది. ఆర్మీ డేను చాలా ఘనంగా నిర్వహించేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ఆర్మీ చీఫ్కు అతిథిగా రావాలంటూ ఆహ్వానం అందడం భారత్కు దౌత్యపరంగా దెబ్బ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ మొండిపట్టుదల వీడి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలన్నారు.