Iran Ceasefire: కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.. ఇరాన్ కీలక ప్రకటన
ABN , Publish Date - Jun 24 , 2025 | 10:46 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. దీంతో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సర్దుమణిగినట్టైంది.

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పేర్కొన్నారు. క్రెడిట్ తనదేనని చెప్పుకున్నారు. అలాంటిదేమీ లేదని ఇరాన్ వెంటనే స్పష్టం చేసింది. యూటర్న్ తీసుకున్నట్టు కనిపించింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్లోని బీర్షేవా నగరంపై మిసైల్ దాడులకు దిగింది. ముగ్గురు ఇజ్రాయెల్ వాసులు కూడా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఏమైనట్టు అన్న సందేహాలు వెల్లువెత్తాయి. ఇంతలోనే యుద్ధం ముగింపుపై ఇరాన్ మరో కీలక ప్రకటన చేసింది (Iran Announces Ceasefire). పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది.
ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. తాజా దాడిపై కూడా స్పష్టత ఇచ్చింది. విరమణ ఒప్పందం కుదరకమునుపే మిసైల్స్ దాడి జరిగిందని వెల్లడించింది. అంతకుమునుపు, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఓ కీలక ప్రకటన చేశారు. ‘ఇజ్రాయెల్ను శిక్షించేందుకు మా మిసైల్ దాడులు ఉదయం నాలుగు గంటల వరకూ కొనసాగాయి. ఈ సందర్భంగా మా సాయుధ దళాలకు ప్రజలందరితో కలిసి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇరాన్ రక్షణ కోసం చివరి రక్తపు బొట్టును కూడా త్యాగం చేసేందుకు సాయుధ దళాలు సిద్ధమయ్యాయి. చివరి నిమిషం వరకూ శత్రువుపై దాడులు చేశారు’ అని యుద్ధం ముగింపు గురించి పరోక్ష ప్రకటన చేశారు. మంగళవారం గ్రినిజ్ టైమ్ ప్రకారం ఉదయం నాలుగు గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు.. ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే..
ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ముగిసింది.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి