Asaduddin Owaisi: పాక్ ఆర్మీ చీఫ్ పై నిప్పులు చెరిగిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ABN , Publish Date - May 29 , 2025 | 10:08 AM
పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రవాద దురాగతాలకి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పాక్ చేస్తున్న దుర్మార్గపు చర్యల్ని రియాద్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు కళ్లకు కట్టినట్టు చప్పే ప్రయత్నం చేశారు అసద్.

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్కు ఉగ్రవాదంతో సంబంధం ఉందన్న స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని AIMIM(ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారతదేశంలో మారణకాండ సృష్టించిన 26/11 నేరస్థుల గురించి భారత్ పూర్తి సమాచారం ఇచ్చినప్పటికీ పాకిస్తాన్.. ఉగ్రమూకలపై ఏ చర్యా తీసుకోలేదని అసద్ గుర్తుచేశారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం రియాద్లో పర్యటించింది. ఈ బృందంలో సభ్యుడైన అసదుద్దీన్ పాక్ ఉగ్రవాదానికి ఇస్తున్న ఊతాన్ని రియాద్ ప్రభుత్వం, అక్కడి ప్రజల కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించడాన్ని అసద్ తప్పుబట్టారు. అతనికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, దీనికి సాక్ష్యంగా అసద్ ఒక ఫొటోని కూడా చూపించారు.
పాకిస్తాన్ను తిరిగి FATF గ్రే లిస్ట్లో ఉంచాలి: ఒవైసీ
ఉగ్రవాద సంస్థలకు నిధులను నియంత్రించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ అసదుద్దీన్.. "పాకిస్తాన్ను తిరిగి గ్లోబల్ మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల నిఘా సంస్థ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్లో ఉంచాలని ఒవైసీ కోరారు.
"పాకిస్తాన్ను తిరిగి FATF గ్రే లిస్ట్లోకి తీసుకురావాలి. అక్కడే మనం ఈ ఉగ్రవాద సంస్థలకు మళ్లించే ఉగ్రవాద నిధులను నియంత్రించగలుగుతాము." అన్నారు. "భారతదేశాన్ని అస్థిరపరచడం, దేశంలో మరిన్ని హిందూ-ముస్లిం అల్లర్లను సృష్టించడం వారి లక్ష్యమని AIMIM నేత ప్రపంచం ముందు కుండబద్దలు కొట్టారు. పాకిస్థాన్.. భారత దేశానికి తలపెడుతున్న దారుణాలు, ఆపై ఆపరేషన్ సిందూర్ సైనిక దాడుల గురించి ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత్ అఖిలపక్ష బృందాన్ని ప్రపంచ దేశాలకు పంపించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News