Germany Supports India: ఉగ్రవాదంపై యుద్ధం.. భారత్కు మద్దతుగా జర్మనీ
ABN , Publish Date - May 23 , 2025 | 09:43 PM
ఉగ్రవాదం ముప్పును తిప్పి కొట్టేందుకు భారత్ స్వీయ రక్షణ హక్కు ఉందని జర్మనీ స్పష్టం చేసింది. పహల్గాం దాడిని ఖండించింది.

ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్కు స్వీయ రక్షణ హక్కు ఉందని జర్మనీ స్పష్టం చేసింది. కశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ఖండించింది. ఈ మేరకు జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి జొహాన్ వేడ్ఫుల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జర్మనీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి జైశంకర్తో కలిసి జర్మనీ మంత్రి బెర్లిన్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొన్నారు.
పహల్గాం దాడిని జర్మనీ మంత్రి ఖండించారు. ప్రస్తుతం పాక్, భారత్ల మధ్య కుదిరిన అవగాహనను కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించాలని అన్నారు. ‘‘ఉగ్రవాదం నుంచి తనని తాను రక్షించుకునే హక్కు భారత్కు ఉంది. ఉగ్రవాదాన్ని అస్సలు ఉపేక్షించబోమని మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. జర్మనీ మద్దతును స్వాగతించారు. అణుదాడి బ్లాక్ మెయిల్కు లొంగబోమని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రి జైశంకర్ ఐరోపా టూర్లో భాగంగా జర్మనీలో పర్యటిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ ఆవశ్యకతను ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ దౌత్య బృందాలను పంపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి జైశంకర్ ఐరోపాలో పర్యటిస్తున్నారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉన్న భారత యాత్రికులను ఉగ్రమూకలు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది కన్నుమూశారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తరువాత రెచ్చిపోయి కాల్పులకు తెగ బడ్డ పాక్కు తగిన రీతిలో బుద్ధి చెప్పింది.
అనంతరం, భారత ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇకపై ఉగ్రవాదంపై భారత్ చర్యలు ఇలాగే ఉంటాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడులను ఇకపై యుద్ధ చర్యగా భావిస్తామని పాక్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Also Read:
ఎస్-400 లాంటి ఫవర్ఫుల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇవే..
RBI: పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు సాయం చేసిన ఆర్బీఐ.. ఎందుకంటే..
Read Latest and International News