Colombia: వాస్తవాన్ని వివరించిన భారత్.. పాక్కు మద్దతు ఉపసంహరించిన కొలంబియా
ABN , Publish Date - May 31 , 2025 | 09:58 AM
భారత దౌత్యం ఫలించింది. భారత దాడుల్లో మృతి చెందిన పాకిస్థానీలకు సంతాపం తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను కొలంబియా తాజాగా ఉపసంహరించుకుంది. వాస్తవాం తమకు తెలిసిందని పేర్కొంది.

ఇంటర్నెట్ డెస్క్: భారత దౌత్యం ఫలించింది. కొలంబియా పాక్కు భారీ షాకిచ్చింది. భారత్ చేసిన దాడుల్లో మరణించిన పాకిస్థానీలకు సంఘీభావం తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను కొలంబియా ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఎంపీ శశి థరూర్ ఆధ్వర్యంలోని అఖిల పక్ష దౌత్య బృందంతో సమావేశమైన అనంతరం విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి రోసా యొలాండా ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘కశ్మీర్లో స్థితిగతులు, ఇరు దేశాల ఉద్రిక్తతలకు సంబంధించి మాకు సవివరమైన సమాచారం, వివరణ అందింది. వాస్తవం ఇదేనని కూడా మేము విశ్వసిస్తున్నాము’’ అని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ శశి థరూర్ కొలంబియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పాక్ అనుకూల ప్రకటన ఉపసంహరించుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కొలంబియా ప్రభుత్వ చర్య తమ దృష్టిలో ఎంతో విలువైనదని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ ఆవశ్యకత, పాక్ దుర్నీతిని ఎండగట్టేందుకు ఎంపీ శశి థరూర్ సారథ్యంలోని దౌత్య బృందం కొలంబియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ మృతులకు సంతాపం తెలుపుతూ కొలంబియా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ పరిణామంపై శశి థరూర్ స్పందించారు. కొలంబియా ప్రభుత్వ చర్య విచారకరమని అన్నారు. ఉగ్రవాదానికి బాధిత దేశంగా ఉన్న భారత్ పక్షాన నిలవకుండా పాక్ మృతులకు సంఘీభావం తెలపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు, స్వీయరక్షణ కోసం పోరాడే వారికి మధ్య పోలిక లేదని అన్నారు. ఉగ్రవాదానికి పాక్ ఊతమిస్తున్న వైనాన్ని కూడా శశి థరూర్ ఎండగట్టారు. ఈ చర్యలను భారత్ అస్సలు సహించదని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
ఆపరేషన్ సిందూర్పై కొలంబియా అభ్యంతరం.. స్పందించిన శశి థరూర్
ఆపరేషన్ సిందూర్తో దీటైన జవాబిచ్చాం.. సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి