Athletes: ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారుల మృతి
ABN , Publish Date - Jun 02 , 2025 | 07:45 AM
Athletes: క్రీడా కార్యక్రమం ముగిసిన తర్వాత మొత్తం 35 మంది బస్సులో కనో స్టేట్కు బయలు దేరారు. 35 మందిలో క్రీడాకారులతో పాటు క్రీడా అధికారులు కూడా ఉన్నారు. అయితే, వారంతా ఇంటికి చేరుకోక ముందే ఊహించని దారుణం చోటుచేసుకుంది.

క్రీడల్లో రాణించాలని.. పేరు ప్రఖ్యాతలు సాధించాలని కలలు గన్న ఆ 21 మంది క్రీడాకారుల జీవితం అర్థాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదంలో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ పెను విషాదం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాల మేరకు.. సౌత్ వెస్ట్ నైజీరియా, కనోస్టేట్కు చెందిన దాదాపు 20 మంది క్రీడాకారులు తాజాగా, ఓగన్ స్టేట్లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు.
క్రీడా కార్యక్రమం ముగిసిన తర్వాత మొత్తం 35 మంది బస్సులో కనో స్టేట్కు బయలు దేరారు. 35 మందిలో క్రీడాకారులతో పాటు క్రీడా అధికారులు కూడా ఉన్నారు. అయితే, వారంతా ఇంటికి చేరుకోక ముందే ఊహించని దారుణం చోటుచేసుకుంది. కురా లోకల్ గవర్నమెంట్ ఏరియాలోని బ్రిడ్జి దగ్గర బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది క్రీడాకారులు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎమర్జెన్సీ సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఇక, ఈ సంఘటనపై నైజీరియా మాజీ ఉపాధ్యక్షుడు అటికు అబుబకర్ మాట్లాడుతూ.. ‘ ప్రమాదం గురించి తెలిసి నా మనసు ముక్కలైంది. 21 మంది కనో స్టేట్ క్రీడాకారులు చనిపోవటం విషాదకరం. అబేకుటాలో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది’ అని అన్నారు. స్టేట్స్ స్పోర్స్ కమిషన్ ఛైర్మన్ ఉమర్ ఫగ్గీ మాట్లాడుతూ.. ‘ ఆ క్రీడాకారులు కనో స్పోర్స్ కమిషన్ బస్సులో ప్రయాణిస్తుండగా బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయింది. 21 మంది చనిపోయారు’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..