Drinking While Standing: నిలబడి నీళ్లు తాగితే కిడ్నీలపై ప్రభావం పడుతుందా..
ABN , Publish Date - Jun 02 , 2025 | 09:03 AM
Drinking While Standing: నిలబడి నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, మరీ ముఖ్యంగా కిడ్నీలపై ప్రభావం పడుతుందని కుటుంసభ్యులనుంచో.. స్నేహితుల నుంచో మీరు వినే ఉంటారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు చదివే ఉంటారు.

మానవ శరీరానికి నీరు ఇంధనం లాంటిది. మనిషి శరీరంలో దాదాపు 60 శాతం నీరు ఉంటుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. తగినంత నీటిని లోపలికి పంపిస్తూ ఉండాలి. అయితే, నిలబడి నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, మరీ ముఖ్యంగా కిడ్నీలపై ప్రభావం పడుతుందని కుటుంసభ్యులనుంచో.. స్నేహితుల నుంచో మీరు వినే ఉంటారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు చదివే ఉంటారు. నిలబడి నీళ్లు తాగటం వల్ల నిజంగా మన కిడ్నీలపై ప్రభావం పడుతుందా?.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?..
బెంగళూరుకు చెందిన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ఫ్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ కిరణ్ బీజే మాట్లాడుతూ.. ‘ నిలబడి నీళ్లు తాగటం వల్ల కిడ్నీలు దెబ్బ తింటాయని, జాయింట్ పెయిన్ వస్తుందని, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని చాలా మంది నమ్ముతున్నారు. ఆ నమ్మకాలకు సైంటిఫిక్ ఆధారాలు లేవు. నిలబడి నీళ్లు తాగినా.. కూర్చుని నీళ్లు తాగినా.. నేరుగా మీ కిడ్నీలపై ప్రభావం ఉండదు. కిడ్నీలు 24 గంటలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. చెడు పదార్థాలను బయటకు పంపిస్తూ ఉంటాయి.
వాటికి మీరు ఏ పొజిషన్లో నీళ్లు తాగుతున్నారన్నది అనవసరం. నిలబడి నీళ్లు తాగటం వల్ల కిడ్నీలు పాడవుతాయని ఏ పరిశోధనల్లోనూ తేలలేదు. సరైన మోతాదులో నీళ్లు తాగకపోతేనే కిడ్నీలపై ప్రభావం ఉంటుందని పరిశోధనల్లో తేలింది’ అని అన్నారు. కాగా, నిలబడి నీళ్లు తాగటం వల్ల కిడ్నీలకు ఎలాంటి నష్టం లేకపోయినా.. కూర్చుని నీళ్లు తాగటం వల్ల మాత్రం లాభం ఉంది. కూర్చోవటం వల్ల ప్రశాంతంగా నీటిని ఆస్వాదిస్తూ తాగొచ్చు. తాగే నీటిపై శ్రద్ధ పెట్టవచ్చు. ఇలా చేయటం వల్ల సాధారణం కంటే ఎక్కువ హైడ్రేట్గా ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి
ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారుల మృతి
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..