Kartika Amavasya: కార్తీక అమావాస్య రోజు ఇలా చేస్తే దోషాలు ..!
ABN , Publish Date - Nov 18 , 2025 | 03:02 PM
నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు. అందుకే కార్తీక అమావాస్య రోజు సూర్యాస్తమయం అనంతరం.. నువ్వుల నూనెతో గుమ్మం ముందు, దేవుని వద్ద.. తులసికోట దగ్గర దీపం వెలిగించడం అత్యంత శు భప్రదమని సూచిస్తున్నారు.
పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. ఈ మాసమంతా పుణ్య దినాలే. ఈ కార్తీక మాసం గురువారంతో అంటే.. నవంబర్ 20వ తేదీతో ముగియనుంది. ఈ కార్తీక అమావాస్య రోజు పూర్వీకులను ఆరాధిస్తే పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుందని బలంగా విశ్వసిస్తారు. ముఖ్యంగా పితృపూజకు ఈ కార్తీక అమావాస్య అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ అమావాస్య రోజు.. చాలా మంది పవిత్ర గంగా నది లేదా సమీపంలోని నది స్నానాలు ఆచరిస్తారు. దానధర్మాది కార్యక్రమాల్లో సైతం పాల్గొంటారు. ఈ రోజు.. శివకేశవులను ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
ఇంతకీ అమావాస్య ఎప్పుడు..?
కార్తీక అమావాస్య 2025 నవంబర్ 19వ తేదీ ఉదయం 9:44 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12:17 గంటలకు ముగుస్తుంది సూర్యోదయం ఉండే తిథిని పరిగణలోకి తీసుకుంటారు. దాంతో నవంబర్ 20వ తేదీ కార్తీక అమావాస్య జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఎందుకు ఈ రోజు..
జీవితంలో ఎదురయ్యే ప్రతికూల శక్తుల నుంచి బయటపడేందుకు ఈ రోజు పూజలు చేస్తారు. పూర్వీకుల ఆత్మశాంతి కోసం పితృపూజ, తిలా తర్పణం, పిండ దానం తదితర ఆచారాలను నిర్వహిస్తారు. ఈ రోజు పేదవారికి అవసరమైన వస్తువులు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందంటారు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు.. శక్తి కొద్దీ దీపదానం, అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల శుభం కలుగుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఈ రోజు.. ఇవి చేయాలి..
మహాశివుడికి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం వంటి విశిష్టమైన పూజలు చేయడం వల్ల జీవితంలో సానుకూలత, సిరి సంపదలు, శ్రేయస్సు, కీర్తి, ఆనందం, ఆరోగ్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
నువ్వుల నూనెతో ఇలా..
నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ రోజు సూర్యాస్తమయం అనంతరం.. నువ్వుల నూనెతో గుమ్మం ముందు, దేవుని వద్ద.. తులసికోట దగ్గర దీపం వెలిగించడం అత్యంత శుభప్రదమని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం తప్పుకుండా లభిస్తుందని చెబుతారు.
ఇక మహావిష్ణువుకు తులసి మాల సమర్పించడం కూడా విశిష్టమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా బెల్లం, నువ్వులను మహా విష్ణువుకు నైవేధ్యంగా సమర్పించాలి. అనంతరం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు తప్పక లభిస్తాయని చెబుతారు. ఈ రోజు.. చీమలకు పంచదార, గోవులుకు పచ్చగడ్డి ఆహారంగా పెట్టడం వల్ల శని దోషాలు తొలిగి.. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతా డీజీపీ పర్యవేక్షణలోనే..మావోల అరెస్ట్పై కృష్ణా ఎస్పీ
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే
Read Latest Devotional News And Telugu News