Vodafone Idea Debt Crisis: ఆదుకోండి.. మహాప్రభో
ABN , Publish Date - May 17 , 2025 | 03:09 AM
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా, 2026 మార్చి తర్వాత ప్రభుత్వ సాయం లేకుంటే దివాలా తప్పదని టెలికాం శాఖకు లేఖ రాసింది. రూ.1.95 లక్షల కోట్ల బకాయిలు ఉండటంతో, కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమవుతోంది.

ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా లేఖ 8 లేకపోతే దివాలా తప్పదు
న్యూఢిల్లీ: టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కథ కంచికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. పీకల్లోతు అప్పులు, నష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని మరోసారి ప్రభుత్వా న్ని కోరింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న నిధులతో మహా అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి వరకు నెట్టుకురాగలమని స్పష్టం చేసింది. కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోకపోతే 2026 మార్చి తర్వాత దుకాణం నడపడం మా వల్ల కాదని కంపెనీ సీఈఓ అక్షయ ముంద్రా గత నెల 17న కేంద్ర టెలికాం శాఖ (డాట్) కార్యదర్శికి ఒక లేఖ రాశారు. వచ్చే ఏడాది మార్చిలోగా ప్రభుత్వ సాయం అందకపోతే దివాలా కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని కూడా ఆయన ఆ లేఖలో తేల్చి చెప్పారు.
మూసివేత తప్పదా !
బ్యాంకుల నుంచి కొత్త అప్పులు పుట్టకపోతే నెట్వర్క్ విస్తరణ, ఆధునీకరణకు చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయలేమని వొడాఫోన్ ఐడియా సీఈఓ తన లేఖలో డాట్కు తేల్చి చెప్పారు. అదే జరిగితే గత ఏడాది కాలంగా చేసిన పెట్టుబడి ఖర్చులూ బూడిదలో పోసిన పన్నీరుగా మారతాయని హెచ్చరించారు. అప్పుడు కంపెనీ ఆస్తుల విలువ పడిపోతుందని స్పష్టం చేశారు. కంపెనీ ఈక్విటీలో ఇప్పటికే ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. ఏజీఆర్, స్పెక్ట్రమ్ బకాయిల్లో కొంత మొత్తాన్ని ఈక్విటీగా మార్చడం ద్వారా ప్రభుత్వం ఈ వాటా తీసుకుంది. అయినా కంపెనీ ప్రభుత్వానికి ఇంకా రూ.1.18 లక్షల కోట్ల వరకు బకాయిలు చెల్లించాలి. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు నేపథ్యంలో ఏజీఆర్ బకాయిలపై ప్రభుత్వం ఇంకా వెసులుబాటు కల్పించే స్థితిలో లేదు. దీంతో వొడాఫోన్ ఐడియా ఎన్సీఎల్టీకి వెళితే కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఆ స్థితి నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒక కంపెనీ ముందుకు వచ్చి వొడాఫోన్ ఐడియా ఆస్తులను కొనుగోలు చేయాలి. ఇందుకు ఏ కంపెనీ ముందుకు వస్తుందన్నది ప్రస్తుతం పెద్ద ప్రశ్న. మరోవైపు అదానీ గ్రూప్ రంగ ప్రవేశం చేసి వొడాఫోన్ ఐడియాను దక్కించుకునే అవకాశం ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
రూ.1.95 లక్షల కోట్ల బకాయిలు
వొడాఫోన్ ఐడియా ఇప్పటికే ప్రభుత్వానికి ఏజీఆర్, స్పెక్ట్రమ్ బకాయిల రూపంలో రూ.1.95 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో పెనాల్టీలు, ఆ జరిమానాలపై వడ్డీల రూపంలో చెల్లించాల్సిన రూ.30,000 కోట్లను చెల్లింపుల నుంచి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించేలా గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ఈ నెల 19న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈ పిటిషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఈ లేఖ బయటికి రావడం విశేషం.