India E-commerce: భారత ఈ-కామర్స్పైనా అమెరికా కన్ను
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:02 AM
భారత ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశం కోసం అమెరికా తన అమెజాన్, వాల్మార్ట్లకు ఆంక్షలు తొలగించాలని ఒత్తిడి చేస్తోంది. దీనివల్ల దేశీయ కిరాణా వ్యాపారాలు, సంస్థలు ముప్పులోకి వస్తాయని వ్యాపార సమాఖ్య హెచ్చరిస్తోంది

అమెజాన్, వాల్మార్ట్లపై ఆంక్షలు తొలగించాలని ఒత్తిడి
వద్దంటున్న కిరాణా వ్యాపారులు
రిలయన్స్ రిటైల్, డీమార్ట్లకూ ముప్పే
న్యూఢిల్లీ: దాదాపు 12,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.10.65 లక్షల కోట్లు) స్థాయికి చేరిన దేశీయ ఈ-కామర్స్పైనా అమెరికా కన్నేసింది. తన అమెజాన్, వాల్మార్ట్ కంపెనీలకూ భారత్ ఈ-కామర్స్ మార్కెట్ తలుపులు బార్లా తెరవాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలోనూ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావించినట్టు సమాచారం. అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎ్సటీఆర్) జామీసన్ గ్రీర్ కూడా ఈ విషయంలో పట్టుదలతో ఉన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గించడంతో పాటు వివక్షాపూరితమైన ఆంక్షలనూ తొలగించాని డిమాండ్ చేశారు.
ఎందుకంటే ?
దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. క్విక్ కామర్స్ కంపెనీలైతే దేశంలోని దాదాపు 100 ప్రధాన నగరాల్లోకి చొచ్చుకుపోయాయి. ఈ మార్కెట్లో ప్రస్తుతం అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ భారత అనుబంధ సంస్థ ఫ్లిప్కార్ట్దే హవా. మరో అమెరికా రిటైల్ దిగ్గజం అమెజాన్ కూడా ఈ రంగంలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ ఈ-కామర్స్ సంస్థలు ఇతర సంస్థల వస్తు,సేవలకు మార్కెట్ వేదికలుగా మాత్రమే పని చేయాలి. అవి నేరుగా వస్తువులను తయారు చేసి.. స్టోర్ చేసి తమ ప్లాట్ఫామ్స్ ద్వారా నేరుగా ఆన్లైన్లో విక్రయించేందుకు వీల్లేదు. వివక్షాపూరితమైన ఈ ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికా ప్రస్తుతం మోదీ సర్కారుపై ఒత్తిడి చేస్తోంది.
కిరాణాకు ఉరితాడే!
ఈ విషయంలో ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోతే దేశంలోని కిరాణా దుకాణాలకు అది ఉరితాడులా మారుతుందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) హెచ్చరిస్తోంది. ఈ-కామర్స్ సంస్థల అడ్డగోలు ధరలు, డిస్కౌంట్లకు తట్టుకోలేక గత రెండు మూడేళ్లలో దాదాపు 10 లక్షల కిరాణా దుకాణాలు మూతపడి లక్షల మంది ఉపాధిలేక రోడ్డున పడినవిషయాన్ని గుర్తు చేసింది. అమెరికా ఈ-కామర్స్ దిగ్గజాలకూ సమాన అవకాశాలు కల్పించడం అంటే రిలయన్స్ రిటైల్, డీమార్ట్ వంటి దేశీయ రిటైల్ దిగ్గజాలకూ ముప్పని హెచ్చరించింది.