India US Trade Talks: భారత్, అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ABN , Publish Date - May 20 , 2025 | 12:38 PM
భారతదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో తమ వ్యాపార సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి. అందుకు సంబంధించిన చర్చల (India US Trade Talks) గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించడంపై భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు (India US Trade Talks) కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వాషింగ్టన్లో నేడు (మంగళవారం) సమావేశమయ్యారు. ఈ విషయాన్ని పీయూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ చిత్రాన్ని పోస్ట్ చేసి తెలిపారు. ఫస్ట్ ఫేస్ చర్చలు పూర్తి చేసే దిశగా మంచి చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement - BTA) చర్చలను వేగవంతం చేయడానికి చర్చలు జరిపారు. ఈ ఒప్పందం ద్వారా భారతదేశం, అమెరికా తమ ఆర్థిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.
వాణిజ్య ఒప్పందం ముఖ్య లక్ష్యాలు
ఈ ఒప్పందం మొదటి దశను ఈ సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ చర్చలలో మార్కెట్ యాక్సెస్, రూల్స్ ఆఫ్ ఒరిజినల్, నాన్-టారిఫ్ బారియర్స్ వంటి అనేక అంశాలు ఉన్నాయి. అమెరికా.. భారతదేశంలో తమ వస్తువులు ఎదుర్కొంటున్న కొన్ని సుంకేతర అడ్డంకులపై ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో, భారతదేశం తమ శ్రమాధార రంగాలైన టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, లెదర్ గూడ్స్, గార్మెంట్స్, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, రసాయనాలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటి ఉత్పత్తులకు సుంకాల సడలింపులను కోరుతోంది.
మరోవైపు, అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్ (ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు), వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డైరీ, వ్యవసాయ ఉత్పత్తులైన ఆపిల్స్, ట్రీ నట్స్ వంటి రంగాలలో సుంకాల సడలింపులను కోరుతోంది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు తమ వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి, పరస్పర లాభాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి.
90 రోజుల విరామం
ఈ చర్చలు 90 రోజుల సుంకాల విరామ సమయంలో జరుగుతున్నాయి. ఇది జులై 9 వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ఏప్రిల్ 2న అమెరికా భారతదేశంపై విధించిన అదనపు 26 శాతం సుంకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య విస్తరిస్తున్న వాణిజ్య లోటును తగ్గించడానికి ఒక అవకాశమని చెప్పవచ్చు. అయితే, రెండు దేశాలపై 10 శాతం బేస్లైన్ సుంకం యథాతథంగా కొనసాగుతుంది.
భారతదేశం-అమెరికా వాణిజ్య సంబంధాలు
2024-25లో అమెరికా వరుసగా నాలుగో సంవత్సరం భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం 131.84 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ క్రమంలో భారతదేశం మొత్తం వస్తువుల ఎగుమతిలో అమెరికా 18 శాతం వాటాను కలిగి ఉంది. దిగుమతులలో 6.22 శాతం. మొత్తం వస్తువుల వాణిజ్యంలో 10.73 శాతం వాటాను కలిగి ఉంది. 2024-25లో భారతదేశం అమెరికాతో 41.18 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును నమోదు చేసింది. గత సంవత్సరాలలో ఈ లోటు 2023-24లో 35.32 బిలియన్ డాలర్లు, 2022-23లో 27.7 బిలియన్ డాలర్లు, 2021-22లో 32.85 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే విస్తరిస్తున్న వాణిజ్య లోటుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఒప్పందం ప్రధాన అంశాలు
ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాలు 19 అధ్యాయాలను కలిగి ఉన్న టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToRs)ను ఖరారు చేశాయి. ఇందులో సుంకాలు, వస్తువులు, సేవలు, ఇతర నియమాలు, సుంకాలేతర అడ్డంకులు, కస్టమ్స్ సౌలభ్యం వంటి అంశాలు ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు తమ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, వాణిజ్య లోటును తగ్గించడానికి, పరస్పర లాభాలను సాధించడానికి కృషి చేస్తున్నాయి.
ఇవీ చదవండి:
Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్డేట్..యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి..
Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..
Trump Putin Call: రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..
IPL 2025: ప్లేఆఫ్ సినారియోను మార్చేసిన హైదరాబాద్ జట్టు..కానీ చివరకు..
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి