Gold Price Hits: బంగారం మళ్లీ లక్ష
ABN , Publish Date - Jun 14 , 2025 | 06:50 AM
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో శుక్రవారం బులియన్ మార్కెట్ రేసుగుర్రంలా పరిగెత్తింది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం ధర రూ.2,200 లాభంతో రూ.1,01,540ని తాకింది.

రికార్డు స్థాయికి వెండి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో శుక్రవారం బులియన్ మార్కెట్ రేసుగుర్రంలా పరిగెత్తింది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం ధర రూ.2,200 లాభంతో రూ.1,01,540ని తాకింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన రికార్డు ధర రూ.1,01,600తో పోలిస్తే ఇది రూ.60 మాత్రమే తక్కువ. కిలో వెండి ధర రూ.1,100 లాభంతో రూ.1,08,200కు చేరి సరికొత్త రికార్డును నెలకొల్పింది. తెలుగు రాష్ట్రాల్లోనూ 10 గ్రాముల మేలిమి పసిడి ధర శుక్రవారం రూ.1.02 లక్షలపైన ట్రేడైంది. హైౖదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,000 లాభంతో రూ.1.2 లక్షలకు చేరింది. మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్లోనూ ఆగస్టులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి పసిడి ధర శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే రూ.2,011 లాభంతో రూ.1,00,403 రికార్డు స్థాయికి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ పరుగు: అంతర్జాతీయ మార్కెట్లలోనూ పసిడి ధర సెగలు కక్కుతోంది. గురువారం 3,386 డాలర్ల వద్ద వద్ద ముగిసిన ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర శుక్రవారం ఒక దశ లో 57.19 డాలర్ల లాభంతో 3,343 డాలర్ల (సుమారు రూ.2,87,732) స్థాయికి చేరింది. ఏప్రిల్లో నమోదైన రికార్డు ధర 3,509 డాలర్ల కంటే ఇది 166 డాలర్లు తక్కువ. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఔన్స్ పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే 3,550 డాలర్లకు చేరే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ సంస్థ (కమొడిటీస్ రీసెర్చి) విభాగం ఏవీపీ కయనత్ చైన్వాలా తెలిపారు. ఔన్స్ ధర 3,400 డాలర్ల పైన ట్రేడైనంత వరకు పసిడికి ఢోకా ఉండకపోవచ్చన్నారు. ఒకవేళ పడినా 3,240 డాలర్ల వద్ద గట్టి మద్దతు లభిస్తుందన్నారు.
ర్యాలీకి కారణాలు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రారంభమైన పోరు.
పెట్టుబడుల రక్షణ కోసం పసిడి కొనుగోళ్లు పెరగడం.
అమెరికా వాణిజ్య సుంకాలపై కొనసాగుతున్న అనిశ్చితి.
అమెరికాలో వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయనే అంచనాలు.
పడిపోతున్న డాలర్ మారకం రేటు.
అమెరికా ద్రవ్య లోటు రికార్డు స్థాయిలో ఏడు శాతానికి చేరడం.
అమెరికా అప్పుల కుప్పగా మారడం.