LPG Price Cut: గుడ్ న్యూస్ తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధర.. ఏ నగరాల్లో ఎంత ఉందంటే..
ABN , Publish Date - Jun 01 , 2025 | 07:49 AM
దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరల విషయంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. వరుసగా మూడో నెల కూడా వీటి ధరలు తగ్గుముఖం (LPG Price Cut) పట్టాయి. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ. 24 తగ్గించాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు వరుసగా మూడో నెలలో కూడా తగ్గిపోయాయి. ఈ క్రమంలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ. 24 తగ్గించాయి (LPG Price Cut). ఈ కొత్త ధరలు జూన్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ తగ్గింపు వాణిజ్య వినియోగదారులకు కాస్త ఆర్థిక ఊరటను ఇస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వాళ్ల రోజువారీ కార్యకలాపాలకు 19 కేజీ సిలిండర్లపై ఆధారపడే వ్యాపారాలకు రోజువారీ ఖర్చులను కొంత ఆదా చేస్తుంది.
వరుసగా మూడో నెల
ఈ ధరల తగ్గింపు కేవలం ఈ నెలకే కాదు. ఇది వరుసగా మూడో నెల తగ్గింపు కావడం విశేషం. మే నెలలో ఆయిల్ కంపెనీలు 19 కేజీ సిలిండర్ ధరను రూ. 14.50 తగ్గించాయి. అంతకు ముందు, ఏప్రిల్ 1న రూ. 41 తగ్గించాయి. అంటే, గత మూడు నెలల్లో ఈ సిలిండర్ల ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
కొత్త ధరలు ఎలా ఉన్నాయి?
ఈ ధరల తగ్గింపు తర్వాత, 19 కేజీ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాల్లో ఇలా ఉన్నాయి
ఢిల్లీలో రూ. 1,723.50
కోల్కతాలో రూ. 1,826
ముంబైలో రూ. 1,674.50
చెన్నైలో రూ. 1,881
హైదరాబాద్లో రూ. 1969
విజయవాడలో రూ.1880.50
ఈ ధరలు నగరాలను బట్టి మారుతుంటాయి. ఎందుకంటే, స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు రాష్ట్రాలను బట్టి మారుతాయి. ఈ తగ్గింపు చిన్నదైనా వ్యాపారస్తులకు కొంత ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.
గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం
అయితే ఈ ధరల తగ్గింపు కేవలం వాణిజ్య సిలిండర్లకు మాత్రమే. ఇంట్లో వంట కోసం ఉపయోగించే గృహ ఎల్పీజీ సిలిండర్ (రూ.14.2 కేజీల) ధరల్లో మాత్రం ఈసారి ఎలాంటి మార్పు లేదు. గత మార్చిలో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గృహ సిలిండర్ ధరలను రూ. 50 పెంచింది. దీనికి కారణం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాల వల్ల ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని ప్రకటించారు. కానీ, ఈసారి గృహ సిలిండర్ ధరలు అలాగే ఉన్నాయి.
ధరలు ఎందుకు మారుతాయి
మన దేశంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ప్రతి నెలా మొదటి రోజున ఎల్పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను సవరిస్తాయి. ఈ ధరలు అంతర్జాతీయ ఇంధన ధరలు, విదేశీ మారక రేట్లలో హెచ్చుతగ్గుల ఆధారంగా నిర్ణయించబడతాయి. అందుకే, రాష్ట్రాల వారీగా స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల కారణంగా ధరల్లో మార్పు ఉంటుంది.
ఇవీ చదవండి:
నేడు పంజాబ్ vs ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్
జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి