Andhra Women Protest: వైఛీపీ విషం
ABN , Publish Date - Jun 10 , 2025 | 03:10 AM
‘ప్రభుత్వంపై విషం చిమ్మండి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తలు ఇదే పని మీద ఉండాలి. దీనికోసం సోషల్ మీడియాను వాడుకోండి’’.. తిరుపతి అంతర్గత సమావేశంలో వైసీపీ తీర్మానం ఇది. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది.

ఈ ఘటనలు యాదృచ్ఛికం కాదు
విషం చిమ్మండి అంటూ తిరుపతిలో పిలుపు
అమరావతిపై అదే తీర్మానం అమలు
కులాలు, ప్రాంతాలే లక్ష్యంగా రాష్ట్రంపై దాడులు
బరితెగించి మరీ అమరావతి మహిళలపై దూషణ
కొమ్మినేని వయసుపై జగన్ వింత వాదన
వేధించినప్పుడు అంకబాబు, రంగనాయకమ్మ
వయసులు గుర్తుకు రాలేదా?
(అమరావతి - ఆంధ్రజ్యోతి )
‘‘ప్రభుత్వంపై విషం చిమ్మండి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తలు ఇదే పని మీద ఉండాలి. దీనికోసం సోషల్ మీడియాను వాడుకోండి’’.. తిరుపతి అంతర్గత సమావేశంలో వైసీపీ తీర్మానం ఇది. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. ఆ తర్వాత 48 గంటలు గడవకముందే, జగన్కు చెందిన రోత మీడియా బరితెగించి మరీ అమరావతి మహిళలపై వ్యాఖ్యలుచేసింది. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ రాజకీయ సలహాకమిటీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఘటనను సమర్థిస్తూ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీంతో వైసీపీ వికృత రూపం రాష్ట్రప్రజలకు కూడా తెలిసిపోయింది. పైతీర్మానాన్ని పరిశీలిస్తే...ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్న ఘటనలు కాదని, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని స్పష్టమవుతోంది. కులమతాలు, ప్రాంతాలపై విద్వేషాన్ని ఎగచిమ్మాలనే తిరుపతి తీర్మానాన్ని సాక్షి చానల్ వేదికగా అమలు చేశారు. రాష్ట్రంలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే, అమరావతిపై కావాలనే విషం చిమ్ముతున్నారని తెలిసిపోతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మాడు పగిలేలా ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. అప్పటినుంచీ రాష్ట్ర ప్రజలపై జగన్ కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమం వేదికగా దుష్ప్రచారం మొదలుపెట్టారు. వైసీపీ సోషల్ మీడియాలో జరిపే ప్రచారాన్ని జనం పెద్దగా పట్టించుకోరని జగన్కు తెలుసు. దీంతో మీడియా ముసుగులో కొంతమంది అద్దె జర్నలిస్టులను పెంచి పోషిస్తూ, ప్రతి చిన్న సంఘటనపైనా ప్రభుత్వాన్ని తప్పుబడుతూ వారితో విషప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఒక ప్రమాదకర ఆటను మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్!
సాక్షి టీవీ డిబేట్లో అమరావతి మహిళలపై ఉచ్ఛరించలేని విధంగా సీనియర్ జర్నలిస్టు కృష్నంరాజు మాట్లాడుతుంటే యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏ దశలోనూ ఆపడానికి ప్రయత్నించలేదు. దీంతో ఆయన చేతులకు పోలీసులు బేడీలు వేశారు. దీన్ని.. అక్రమం, అన్యాయం అంటూ జగన్, సజ్జల గుండెలు బాదుకున్నారు. 70ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమంటూ మాట్లాడారు. అయితే, సామాజిక మాధ్యమంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకుగాను ఏడు పదుల వయస్సు దాటిన సీనియర్ పాత్రికేయుడు అంకబాబును లుంగీతోనే అరెస్టు చేశారు. అప్పుడు గుర్తుకురాని వయసు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా జగన్..అంటూ పలువురు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వచ్చిన పోస్టు నచ్చి ఫార్వర్డ్ చేసినందుకు వృద్ధురాలు రంగనాయకమ్మను అర్థరాత్రి సమయంలో సీఐడీ పోలీసులు విచారణ పేరిట హింసించారు. అప్పుడు అరాచకం అనిపించలేదా జగన్.. అంటూ మండిపడుతున్నారు.