SIT Investigation: 32 వేల జీతం.. 429 కోట్ల లావాదేవీలు
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:37 AM
వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల మద్యం కుంభకోణం కేసులో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నెలకు రూ.32 వేల వేతనానికి ఓ కాఫీ షాప్లో పనిచేసే ఉద్యోగి.. ఏకంగా రూ.429 కోట్ల మేరకు మద్యం లావాదేవీలు...

వైసీపీ మద్యం కుంభకోణంలో మరో చిత్రం
వరుణ్ పురుషోత్తంను ఏ-40గా పేర్కొన్న సిట్
విజయవాడ, జూలై 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల మద్యం కుంభకోణం కేసులో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నెలకు రూ.32 వేల వేతనానికి ఓ కాఫీ షాప్లో పనిచేసే ఉద్యోగి.. ఏకంగా రూ.429 కోట్ల మేరకు మద్యం లావాదేవీలు చేసినట్టు ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించింది. హైదరాబాద్కు చెందిన వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి ఓ కాఫీ షాప్లో రూ.32 వేల వేతనానికి పని చేస్తున్నారు. అయితే, ఆయన పేరు మీద లీలా డిస్టిలరీ్సలో రూ.429 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. ఈ విషయాన్ని గుర్తించిన సిట్ అధికారులు ఈ కేసులో ఆయనను 40వ నిందితుడిగా చేర్చారు. ఆయన ఖాతాలను పరిశీలించి.. నగదు లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించారు. దీంతో పురుషోత్తంను ఏ-40గా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు శుక్రవారం మెమో దాఖలు చేశారు. ఆయనకు సంబంధించిన వివరాలను, నగదు లావాదేవీల వ్యవహారాలను కోర్టుకు సమర్పించారు. కాగా.. మద్యం కుంభకోణం కేసులో నిందితుల జాబితా 40కి చేరింది. కాగా, మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీగా ఉన్న పైలా దిలీప్ బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. దీనిపై న్యాయాధికారి పి. భాస్కరరావు శుక్రవారం తీర్పును వెలువరించారు.